స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రభాస్ ఫాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా థియేటర్ల్లో విడుదలై సందడి చేస్తోంది. ‘ఆగమనం.. అధర్మ విధ్వంసం..’ అంటూ రాముడిగా ప్రభాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈరోజు సినిమా థియేటర్లన్నీ జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. రామాయణానికి టెక్నాలజీని జోడించి రూపొందించండంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాఘవుడిగా ప్రభాస్ నటించగా, జానకిగా కృతి సనన్ కనిపించింది. ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నాడు.
ఇంకోవైపు, ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటికీ హనుమంతుడు వస్తాడు అనే నమ్మకంతో ఇలా చేశారు. ప్రతి థియేటర్ లో ఆంజనేయస్వామి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచుతున్నట్టు దర్శకుడు ఓం రౌత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటించిన విధంగానే ప్రతి థియేటర్ లో ఒక సీటును హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచారు. కొన్ని థియేటర్లలో హనుమంతుడి విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇదిలావుంచితే, ఓ థియేటర్లో అనుకోకుండా ఓ వానరం ప్రవేశించి ‘ఆదిపురుష్’ వీక్షించింది. దీంతో హాలంతా ఒక్కసారిగా ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇది చూసినవారంతా అద్భుతమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘హనుమంతుడే వచ్చి సినిమా చూశాడు’ అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.