బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో తాను మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను తోసేసి అసభ్యకర పదజాలంతో దూషించారని అన్నారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కోరారు సంజయ్.
అసలేం జరిగిదంటే..
ఆదివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతుండగా ఎమ్మెల్యే సంజయ్ దగ్గరికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెళ్లారు. నువ్వు ఏ పార్టీ అంటూ నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రభుత్వ పథకాలపై సమీక్ష సమావేశంలో ఈ వాగ్వాదం జరిగింది. నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావ్ అంటూ పాడి కౌశిక్ రెడ్డి.. తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడుతున్న సంజయ్ ని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్తో గెలిచావంటూ ఫైర్ అయ్యారు. సంజయ్ రాజకీయ జీవితం కేసీఆర్ పెట్టిన బిక్ష అంటూ దూషించారు.
ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ పరస్పరం తోసుకున్నారు. చేయికూడా చేసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. పరుష పదజాలంతో సంజయ్ పై దుర్భాషలాడారు. దీంతో అక్కడున్న వారు పాడిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు.
ఈ సందర్బంగా పాడి కౌశిక్ రెడ్డి సంజయ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధుల గురించి అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో 50 శాతం ప్రజలకు రుణమాఫీ రాలేదని.. అడిగితే దౌర్జన్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అర్హత లేని వారికి కూడా మైకులు ఇచ్చి మాట్లాడిస్తున్నారని మండిపడ్దారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ తరపున మాట్లాడుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి.. సంజయ్ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు.