తెలంగాణ ఫుడ్స్ కార్పోరేషన్ పనితీరుపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో టీజీ ఫుడ్స్ పై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత లేదంటూ వస్తున్న ఫిర్యాదులపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాల అమృతంను తయారీ చేస్తున్న టీజీ ఫుడ్స్ పై ఎంతో బాధ్యత ఉందన్నారు. బాల అమృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదన్నారు. నాసిరకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లు, సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
నాణ్యత లేని, శుభ్రత లేని సరుకులు సప్లై చేసిన కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశించారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడం పట్ల, కారుణ్య నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన జరగడం పట్ల మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు. అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడంపై మండిపడ్డారు. ఇప్పటికే ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా.. తీరు మార్చు కోకపోవడం పట్ల సీరియస్ అయ్యారు. అధికారులంతా పారదర్శకంగా వ్యవహరించాలని, నిస్పక్ష పాతంగా నిర్వహించాలని ఆదేశించారు. లోపాలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.