తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోయాయి. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అసలు పార్టీ నియామవళిని పాటిస్తున్న నేతలు తక్కువనే చెప్పాలి. వీరిలో సీనియర్లు, జూనియర్లు ఎవరూ మినహాయింపు కాదు. హద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తున్న వారిని క్రమశిక్షణలో పెట్టాలని పార్టీ డిసైడ్ అయింది.అప్పటిదాకా ఉన్న పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ దీపా దాస్ మున్షీని తప్పించింది. ఆమె స్థానంలో కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను నియమించింది. వచ్చీ రావడంతోనే తన పని మొదలుపెట్టేశారు మీనాక్షి. ఇక్కడే మకాం వేసి తనదైన మార్కును చూపుతున్నారు. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం అయితే దేశ రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదన్న వాదన వినిపిస్తోంది.
ఆమె తీసుకున్న నిర్ణయం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపునిచ్చేదే అని చెప్పాలి. పార్టీ రాష్ట్ర శాఖలో ఉన్న అన్ని స్థాయిల నేతలను ఆమె మూడు వర్గాలుగా విభజించారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలను తొలి వర్గంగా గుర్తించారు. వారిని అసలు సిసలైన పార్టీ నేతలుగా మొదటి కేటగిరిలో పెట్టేశారు. ఇక రెండో విభాగంలో… 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని చేర్చారు. వీరిలోనూ ఓ స్థాయి వరకు కేటగరైజేషన్ ను అంతగా పట్టించుకోని మీనాక్షి… జిల్లా స్థాయి, ఎమ్మెల్యే స్థాయి నేతల నుంచి ఆ పై స్థాయి వరకు ఏఏ కారణాలతో ఆయా నేతలు పార్టీలో చేరారన్న వివరాలను నమోదు చేస్తున్నారట. ఇక మూడో కేటగిరిలో… పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలను చేర్చారట. ఈ విభాగంలో ఆయా నేతల చేరికలకు గల కారణాలు తదితరాలను కూడా మీనాక్షి నోట్ చేశారట.
ఇలాంటి తరహాలో పార్టీ నేతలను మూడు వర్గాలుగా విభజించిన వైనాన్ని ఏ పార్టీలోనూ ఇంతవరకు చూడలేదనే చెప్పాలి. గతంలో ఏమి జరిగినా తనకు అనవసరమని.. తన వర్కింగ్ స్టైల్ మాత్రం ఇదేనని ఆమె చెప్పకనే చెప్పేశారు. తాను అనుకున్నట్లుగా ఈ కేటగిరీల వర్గీకరణను ఆమె ఇప్పటికే పూర్తి చేసినట్టుగా సమాచారం. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి త్వరలోనే ఖాళీగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయాల్సి ఉంది. అలాగే తరచూ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఆయా పదవులకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అంతిమంగా తదుపరి ఎన్నికల్లో సీట్లను కేటాయించాలి. ఇవన్నీ కూడా ఈ విభాగాల వర్గీకరణ ఆధారంగానే జరగనున్నాయట.