ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా 45 రోజుల తర్వాత బుధవారం ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ముగిసింది. ఈ ఏడాది నిర్వహించిన మహాకుంభమేళా.. గంగా, యమునా, సరస్వతి త్రివేణీ సంగమంలో మొత్తం 66 కోట్ల మంది దేశ, విదేశీ భక్తులు పుణ్యస్నానాలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇది అమెరికా జనాభా 34 కోట్లకు రెండింతలని చెబుతున్నారు.
తర్వాత కుంభమేళా ఎప్పుడు?
తదుపరి కుంభమేళా మహారాష్ట్రలోని నాసిక్లో 2027లో జరగబోతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నాసిక్కు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వరంలో నిర్వహించనున్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద నది అయిన గోదావరి నది ఒడ్డున ఈ నగరం ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వరం శివుని ఆలయం ఇక్కడే ఉంటుంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు.. కుంభమేళా 2027 జులై 17 నుంచి ఆగష్టు 17 వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ముంబైలో జరిగిన NASSCOM టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం 2025లో మాట్లాడుతూ… మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2027 నాసిక్ కుంభమేళాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రణాళికలను వివరించారు.
పవిత్ర గోదావరి నదిలో స్నానం చేయలేని వారు దానిని వర్చువల్గా అనుభవించడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
తదుపరి కుంభమేళా కేవలం మూడు సంవత్సరాలలో ఎందుకు వస్తుంది?
కుంభమేళాలు నాలుగు నగరాల్లో అంటే.. ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ , ఉజ్జయినిలో జరుగుతాయి. ప్రతి మూడు సంవత్సరాలకు కనీసం ఒక కుంభమేళా అయినా నిర్వహిస్తారు.
ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాన్ని కుంభమేళా అని, ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాన్ని అర్ధ కుంభమేళా అని పిలుస్తారు.
ఇక ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించబడే మేళాను పూర్ణ కుంభమేళా అని పిలుస్తారు. ఇటీవల ముగిసినది మహా కుంభమేళా. ఇది 144 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభమేళా.
మహాకుంభమేళా 2025లో కీలక అంశాలు
మహాకుంభమేళా 2025లో చాలా మంది ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు. వారిలో ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, ప్రముఖ వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఉన్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్ కుమార్, కత్రీనాకైఫ్ , విక్కీ కౌశల్ , విజయ్ దేవరకొండ కూడా పుణ్య స్నానాలు చేశారు. కోల్డ్ ప్లే సింగర్ క్రిస్ మార్టిన్ కూడా మహాకుంభమేళాకు వచ్చారు. 77 దేశాల నుండి కనీసం 118 మంది దౌత్యవేత్తలు ఈ మహాకుంభమేళాలో పాల్గొన్నారు.