లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నాలుగో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు కస్టడీ లోకి తీసుకుని విచారించనున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత పాత్ర.. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. రోజులో 6-7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్లో కవిత భోజనం చేస్తున్నారు.
మరో వైపు సుప్రీంకోర్టులో వేసిన కవిత పిటిషన్పై సస్పెన్స్ కొనసాగుతోంది. తన అరెస్టు అక్రమమంటూ సోమవారం పిటిషన్ దాఖలు చేయగా నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు రాలేదు. కవిత అరెస్ట్ కేసు విచారణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం వరకు కవిత కేసు విచారణకు రాకపోతే.. ఏప్రిల్ 1 తర్వాతే కేసు విచారణకు రానుంది. వచ్చే వారం సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు ఉండనున్నాయి. దీంతో కవిత అరెస్టు పిటిషన్ విచారణ ఆలస్యం కానుంది. ఇదిలా ఉంటే కవిత పిటిషన్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.