2024 లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైనా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు. గెలిచే అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మరో పేరు తెరమీదకొచ్చాయి. హుస్నాబాద్ మాజీ ఎంఎల్ఏ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్ రావు టికెట్టు కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఒకరికి టికెట్టు వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో మరొక వ్యక్తి తీన్మార్ మల్లన్న కూడా కరీంనగర్ పార్ల మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తున్నారు. ఇప్పటికే, దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసినా, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి విషయంలో పీటముడి వీడలేదు.
కరీంనగర్ పార్లమెంటరీ స్థానాన్ని అటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నా యి. బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, బీఆర్ఎస్ నుండి మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ పేర్లు ఖరారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఇంకా దోబూచులాడుతూనే ఉంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనా కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల ఎంపికలో తాత్సారంలో అంతర్యం ఏమిటో అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పరేషాన్ లో ఉన్నారు.
కరీంనగర్ ఎంపీ స్థానం కాంగ్రెస్ టికెట్ ను సీనియర్ నేత మాజీ ఎంఎల్ఏ దివంగత వెలిచాల జగపతిరావు కొడుకు వెలిచాల రాజేందర్ రావు, హుస్నాబాద్ మాజీ ఎఎల్ఏ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్ ఆశిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. తీరా టికెట్టు మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కు దక్కింది. నాయకత్వం అలిగి రెడ్డి ప్రవీణ్ ను బుజ్జగించి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్టు వచ్చేలా చేస్తానంటూ హామీఇచ్చారు. పొన్నం ఎంఎల్ఏ గెలుపొంది, మంత్రి పదవి పొంది ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగాడు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో పొన్నం పాత్ర కీలకంగా మారింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్, కేంద్ర ఎన్నికల కమిటీతో చర్చల పరంపర చేసినా,అభ్యర్థి ఎంపిక తేలలేదు. దీంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి,వెలమ సామాజిక వర్గంనుంచి వెలిచాల రాజేందర్ రావు టికెట్ కోసం పోటీ పడుతున్నారు, వారి బలాబలాలపై పార్టీ అధిష్టానం ఇంకా లెక్కలు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. వెలమ సామాజికవర్గానికి చెందిన వెలిచాల రాజేందర్ రావు వైపే అధిష్టానం ఎక్కవ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.దీంతో టికెట్టు కేటాయింపులో నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనందు వల్ల కాంగ్రెస్ అధినాయకత్వం తక్షణం నిర్ణయం తీసుకుని అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కు తెరతీయాలని పార్టీశ్రేణులు కోరుతున్నాయి.