తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనంకోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.
అసలేం జరిగిందంటే..
తిరుపతిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగింది. రెండు వేర్వేరు చోట్ల ఈ తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నాయి.. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు భక్తులు మృతి చెందారు.
బైరాగిపట్టెడ కేంద్రం దగ్గర ముగ్గురు మృతి చెందగా.. శ్రీనివాస అతిథిగృహం దగ్గర ఒకరు మృతి చెందారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. రెండు వేర్వేరు ఘటనల్లో మరో 48 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతి తొక్కిసలాటలో మృతులను గుర్తించారు. మృతులు విశాఖకు చెందిన రజిని (47), శాంతి (34), లావణ్య (40). మృతులు నర్సీపట్నానికి చెందిన నాయుడుబాబు (51), కర్ణాటక బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49)గా గుర్తించారు.