స్వతంత్ర వెబ్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఢాకాలోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళలు 7 వికెట్ల తేడాతో విజయం సాధించారు. బంగ్లాదేశ్ విధించిన 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 54, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టగా, స్మృతి మంధాన 38 పరుగులతో రాణించింది. దీంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టుకు షాతి రాణి (21), షమీమా (17) శుభారంభం అందించారు. మూడో స్థానంలో వచ్చిన శోభన 23 పరుగులు చేసింది. అయితే టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా మిడిల్ ఆర్డర్ తడబడింది. బంగ్లా అమ్మాయిలు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. అయితే షోనా అక్తర్ అజేయంగా 28 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. 115 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు.
ఓపెనర్ షఫాలీ వర్మ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగింది. జెమీమా రోడ్రిగ్స్ కూడా 11 పరుగులకే ఔటైంది. అయితే స్మృతి మంధానతో పాటు నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన హర్మన్ప్రీత్ కౌర్ 35 బంతుల్లో 2 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 54 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 16.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.