పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న హస్తం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజవకర్గాల వారీగా సభలతో హోరెత్తిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో జనజాతర సభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి 75 వేల మందికి పైగా జన సమీకరణ చేస్తు న్నారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కసరత్తు పూర్తి చేశారు.
వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కడియం కావ్య తరుపున ప్రచారం నిర్వహిస్తారు. రెండు రోజుల వ్యవధిలోనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పరకాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ రేవూరి ప్రకాశ్ రెడ్డి సభ ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేయించారు. మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో సభకు హా జరయ్యే వారు ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల ఏర్పాటుమొదలుకొని దారి పొడవునా సభకు వచ్చే వారి కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. సభా స్థలంలో 25 వేల మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లతో పాటు మరో 50 వేల మందికి సరిపడేలా షామియానాలను నిర్మించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగే సభలో పాల్గొన్న తర్వాత రేవంత్ రెడ్డి రేగొండ రానున్నారు. సీఎం రాకకోసం రేగొండలో హెలి ప్యాడ్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రచార షెడ్యూల్ ప్రకారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుంచి బయల్దేరనున్న రేవంత్ రెడ్డి… మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో రేగొండకు చేరుకొని జన జాతర సభలో పాల్గొంటారు. ఆయనతో పాటు ఈ సభకు మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ అలియాస్ సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితరులు కూడా హాజరుకానున్నారు.


