టీడీపీ అధినేత చంద్రబాబు పట్టాభిషేకానికి వేళయింది. రాష్ట్ర విభజన తర్వాత రెండవసారి ఏపీ ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టనున్న చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు పూర్త య్యాయి. మరి బాబుతోపాటు ప్రమాణం చేసేదెవరు..? పట్టాభిషేకానికి వస్తున్న అతిథులెవరు..?
టీడీపీ, జనసేన అధినేతుల కలలు నెరవేరాయి. అనుకున్నట్టుగానే జగన్ను కోలుకోలేని దెబ్బ కొట్టిన కూటమి నాయకులు ఏపీని ఏలేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇక మిగిలిందల్లా పట్టాభిషేకం. మంత్రివర్గ ప్రమాణాస్వీకారాలే. ఇందుకు కూడా కౌంట్డౌన్ షురూ అయింది. బుధవారం ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోపక్క పట్టాభిషేకానికి గన్నవరం వేదికగా ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసరపల్లి ఐటీ పార్కు వద్ద 14 ఎకరాల్లో ముమ్ముర ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర మత్రులు సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయమే ఏపీకి రానున్నారు పీఎం నరేంద్రమోదీ.
మరోపక్క డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్కల్యాణ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ మెంబర్ అయిన హీరో రామ్చరణ్ కూడా కార్యక్రమానికి హాజరవనున్నట్టు తెలుస్తోంది. అలాగే టీడీపీ, జనసేన శ్రేణులు 2 లక్షల వరకు వస్తారన్న అంచనా ప్రకారం భారీ ఎత్తున ఎల్ఈడీ స్క్రీన్ల ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న కారణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్తో కూడిన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి విచ్చేస్తున్న ఏ ఒక్కరికి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, వైద్య శిబిరాలు, మజ్జిగ, తాగునీరు, భోజన సదుపాయాలు కూడా చేసింది అధికార యంత్రాంగం. అలాగే ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖుల రాకతో 7 వేల మంది సిబ్బందితో పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఇకపోతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు జగన్ను చిత్తుగా ఓడించి 11 సీట్లకే పరిమితం చేశాయి. లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లోనూ అత్యధిక సీట్లు కైవసం చేసుకుని పాలనా పగ్గాలు చేపట్టనుంది. ఒక్క అవకాశముంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారన్న విమర్శలను మూటగట్టుకున్నారు.ఇదే ప్రచారాన్ని జనంలోకి గట్టిగా తీసుకువెళ్లారు. అలాగే షర్మిల కూడా అన్న పాలనపై దుమ్మెత్తిపోసింది. ఇలా విపక్షాలన్నీ ఏకమై జగన్ను అధికార పీఠం నుంచిదించి, ఆ అవకాశాన్ని దక్కించుకుంది విపక్ష కూటమి. దీంతో రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మరోపక్క అధికస్థానాలు సాధించి ఎన్డీఏ కూటమిలో రెండో పార్టీగా ఎదిగిన టీడీపీపై ఎన్నో ఆశలు పెట్టు కుంది రాష్ట్ర ప్రజానీకం. విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అమరావతి అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై గంపెడు ఆశలతో ఉంది. అలాగే, కూటమి అధికారంలోకి రావడానికి పెద్దన్న పాత్ర పోషించిన పవన్కల్యాణ్ రాష్ట్రాభివృద్ధిలో తన మార్క్ను చూపిస్తారన్న అంచనాల్లో ఉన్నారు. మరి డైనమిక్ లీడర్గా, ముఖ్యమంత్రి అపార అనుభవం ఉన్న చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్, అలాగే కేంద్రంలో బీజేపీ ఉన్నందున రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఇలా అంతా ఒక్కటై ఏపీనిని ఏ మేర డెవలప్ చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.