సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాడ్స్ వివరాలను ఎన్నికల సంఘం తెలిపింది. ఎస్బీఐ సమర్పించిన వివరాలను సీఈసీ తన వెబ్సైట్లో యథాతథంగా అప్లోడ్ చేసింది. మొత్తం 337 పేజీల డేటాను రెండు సెట్లతో వెబ్సైట్లో ఉంచింది. 2019 నుంచి 2024 వరకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీ లకు అందిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు తెలిపింది. 11 వేల 671 కోట్ల విలువైన బాండ్ల ను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఈ డేటా ద్వారా తెలుస్తోంది. అత్యధికంగా బీజేపీకి విరాళాలు అందినట్టు తెలుస్తోంది.
అత్యధికంగా విరాళాలు అందుకుని బీజేపీ మొదటి స్థానంలో ఉంది. 2019 నుంచి 2024 వరకు బీజేపీకి 6 వేల 061 కోట్ల విరాళాలు అందాయి. తర్వాతి స్థానంలో తృణమూల్ 1 వెయ్యి 610 కోట్ల విరాళాలతో ఉంది. కాంగ్రెస్కు వెయ్యి 422 కోట్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీల వివరాలు చూస్తే.. తెలంగాణలో అత్యధికంగా బీఆర్ఎస్కు వెయ్యి 215 కోట్ల విరాళాలు అందాయి. ఏపీలో వైసీపీకి ఇప్పటిదాకా 337 కోట్లు అందాయి. టీడీపీకి 219 కోట్లు వచ్చాయి. జనసేనకు 21 కోట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు అందాయి. బీజేడీ, డీఎంకే, శివసేన, ఆర్జేడీ, ఆప్, ఎన్సీపీ, ఎస్పీ, జేడీయూకి కూడా విరాళాలు ముట్టాయి. ఎవరెవరు ఎన్ని బాండ్స్ కొనుగోలు చేశారు.. ఏ తేదీన కొనుగోలు చేశారో అన్ని వివరాలను ఈసీ వెబ్ సైట్లో ఉంచింది. బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో స్టీల్ పారిశ్రామిక దిగ్గజం లక్ష్మీ మిత్తల్ నుంచి బిలియనీర్ సునీల్ భారతీ మిత్తల్, అనిల్ అగర్వాల్, ఐటీసీ, మహీంద్ర అండ్ మహీంద్ర, కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజినీరింగ్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, అంతగా పేరులేని ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీలున్నాయి. అయితే ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్న వివరాలను 3 నెలల్లో తెలియజేస్తామని ఎస్బీఐ తెలిపింది.మరోవైపు ఎన్నికల బాండ్లపై ఇవాళ ఎన్నికల సంఘం దరఖాస్తుపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.