బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోందా…? ఒక్కొక్కరుగా కారు దిగి కమలం, కాంగ్రెస్లకు దగ్గరవుతు న్నారా…? తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇంతకు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది…?
తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు మళ్లీ అధికార పార్టీకి దగ్గరవుతున్నారు. అధికార అండ కోసం దారులు వెతుకుతున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు బీజేపీ, కాంగ్రెస్లో చేరారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్, పి.రాములు, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీలో చేరగా..పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత హస్తం గూటికి చేరారు. ఇలా నేతలు ఒక్కొక్కరుగా చేజారడం గులాబీ శిబిరంలో ఆందోళన రేపుతోంది. తాజాగా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్ బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది. ఆరూరి రమేష్ కారు దిగి కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. వెంటనే బీఆర్ఎస్ అలెర్ట్ అయింది. రాజకీయ హైడ్రామా నడుమ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ నివాసానికి రమేష్ను తీసుకొచ్చారు. కేసీఆర్ స్వయంగా ఆరూరి పార్టీ మారకుండా ఒప్పించే ప్రయత్నం చేశారు. వరంగల్ లోక్సభ నుండి పోటీ చేయాలని భావించిన ఆరూరి..కాషాయ కండువా కప్పుకుని బీఆర్ఎస్కి షాక్ ఇచ్చారు.
ఇక మరోవైపు గ్రేటర్లో బీఆర్ఎస్కి తొలి ఎదురుదెబ్బ తగిలింది. బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి గులాబీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. బెంగుళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ను తన కుమారుడు భద్రారెడ్డితో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో మల్లారెడ్డి భేటీ అవుతారని టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామం బీఆర్ఎస్ హైకమాండ్కు మింగుడు పడటం లేదు. నిన్న మొన్నటి వరకు మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా తన కుమారుడు పోటీ చేస్తారని చెప్పిన మల్లారెడ్డి.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం గులాబీ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆదిలాబాద్ పార్లమెంట్ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో ఇంద్రకరణ్రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జోరందు కుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపుగా ఖాయం అయింది. లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుండి అనేక మంది నేతలు పార్టీని వీడటం గులాబీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. లోక్సభ ఎన్నికల నాటికి మరికొందరు నేతలు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. నేతలు పార్టీ వీడకుండా అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.