మున్సిపాలిటీ ఉద్యోగుల నియామకాల్లో రూల్స్ బ్రేక్.. ఎన్నికల కోడ్తో హడావుడిగా భర్తీలు… కౌన్సిల్ తీర్మానం లేకుండానే అంతా కానిచ్చిన అధికారులు. ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ ఆరోపణలు. ఇంతకీ ఉద్యోగాల అమ్మకాలేంటి..? ఎవరా అవినీతి అధికారులు. కాకినాడ జిల్లా పిఠాపురంలో అసలేం జరిగింది..?
కాకినాడ జిల్లాలో మున్సిపాలిటీ ఉద్యోగాల భర్తీ వివాదాస్పదంగా మారింది. పిఠాపురం మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల కు విరుద్దంగా నిమాయకాలు జరిగాయంటూ మండిపడుతున్నారు. మున్సిపల్ కౌన్సిల్కు ఎలాంటి సమాచా రం ఇవ్వకుండానే ఎన్నికల కోడ్ ముందు ఏడుగురు ఉద్యోగులను నియమించడం ప్రస్తుతం వివాదంగా మారిం ది.
పిఠాపురం మున్సిపాలిటీలో ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ విభాగాల్లో ఆరుగురిని నియమించారు అధికారులు. అలాగే ఒక ఉద్యోగికి పోస్టింగ్ మార్చారు. అయితే ఈ ఉద్యోగ నియామకాలు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరిగాయని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మరణించిన ఉద్యోగుల స్థానంలో ఆయా ఉద్యోగి కుటుంబ సభ్యులకు కాకుండా బయట వ్యక్తులకు పోస్టులు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. భర్తీ చేసిన పోస్టులను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కాలం నుండి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారిని పక్కనపెట్టి కొత్తవారికి చోటు కల్పించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల విషయంలో ఓ ప్రజా ప్రతినిధి ద్వారా లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వెంటనే అక్రమంగా భర్తీ చేసిన ఉద్యోగ నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. అవినీతి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పిఠాపురం వాసులు ఆరోపిస్తున్నట్టు ఉద్యోగాల నియామకాల్లో నిబంధనలను గాలికొదిలేశారా..? అధికారులు అవినీతికి పాల్పడ్డారా..? ఉన్నతాధికా రులు విచారణకు సిద్ధమేనా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి .