కామారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా.. యమరంజుగా సాగుతోంది. అవిశ్వాసమా… రాజీనామా అన్న ఆసక్తి నెలకొంది. నమ్మిన బంటుల్లా ఉన్న వారంతా దొడ్డిదారిన ఈ గట్టు నుంచి ఆ గట్టుకి చేరేసరికి ఈ క్లిష్టపరిస్థి తులను ఎలా నెట్టుకురావాలా అని నెట్టు ఫ్యామిలీ తలపట్టుకున్నారు. ఇక అవిశ్వాసానికి గడియలు ముంచుకు రావడంతో ఈ గండం నుంచి గట్టెక్కించేందుకు స్వయంగా కేటీఆరే రంగంలోకి దిగారు. మరి గులాబీ నేత పాచిక పారుతుందా..?, అధికార అండతో సంఖ్యా బలం పెంచుకుని బీఆర్ఎస్కు మరో దెబ్బ కొట్టేందుకు రెడీగా ఉన్న కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా..?
కామారెడ్డి జిల్లాలో క్యాంప్ రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. అధికారం చేతికొచ్చాక ఫుల్ జోష్లో ఉన్న హస్తం పార్టీ… ఎక్కడికక్కడ బీఆర్ఎస్ను దెబ్బ తీసే పనిలో పడింది. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అంటూ ముందుకు సాగుతోంది. గులాబీ బలగాన్ని మొత్తం తనవైపుకి తిప్పుకుని కేసీఆర్కు దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ వ్యూహంలో ఇప్పుడు కామారెడ్డి చిక్కుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నలుగురు కౌన్సిలర్లుగా ఉన్న బలాన్ని.. 27కి పెంచుకుని అవిశ్వాసానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు కౌన్సిలర్లు. దీంతో ఈనెల 30న అవిశ్వాసానికి తేదీ నిర్ణయించారు జిల్లా కలెక్టర్. ఇక అవిశ్వాస తీర్మానం ఇచ్చిందే తడువుగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. తమ కౌన్సిలర్లయిన 27 మంది తోపాటు.. మద్దతుగా నిలిచిన మరో ఏడుగురిని గోవాకు తరలించింది. వీరంతా ఈ నెల 30న నేరుగా అవిశ్వాస సమయంలో మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు.
మున్సిపల్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులంతా అప్పట్లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో వారి సంఖ్య 38కి చేరింది. అయితే… అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రుచి చూసేసరికి ఇప్పుడా సంఖ్య తగ్గిపోయి 16కి చేరింది. మిగిలిన వారిలో ఆరుగురు బీజేపీకి చెందిన వారు కాగా.. 27 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. అయితే,.. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి.. బలంగా ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన 12 మంది కౌన్సిలర్లు విడతల వారీగా ఒక్కొక్కరు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టేసరికి వారంతా ఘర్ వాపసిలో భాగంగా ఒక్కొక్కరూ తిరిగి హస్తం గూటికి చేరారు. వారితోపాటు మరికొందరికి గాలెం వేసి బీఆర్ఎస్కు ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ కొట్టారు.
ఇక ఇదిలా ఉంటే గత ఏడాదిన్నర కాలంగా బీఆర్ఎస్లో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గ్రూపు రాజకీయాలు మొదలై చైర్మన్కు వ్యతిరేకంగా మారారు. ఇప్పుడు ఏకంగా చైర్మన్పై అవిశ్వాసానికి సిద్ధమ య్యారు. ఈ తరుణంలో పార్టీ మారిన కౌన్సిలర్లకు విప్ జారీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ తండ్రి నెట్టు వేణుగోపాల్ రావు, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మధ్య వైరం విప్ జారీకి అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేతో సఖ్యత ఉండి ఉంటే ప్రస్తుతం పార్టీ మారిన కౌన్సిలర్లకు విప్ జారీ చేసే అవకాశం ఉండేదని,.. స్వయంగా తనకు తానుగానే ఈ అవకాశాన్ని చేజార్చుకున్నారు అన్న విమర్శ వినిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్పై కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం అందజేసిన 27 మంది ప్రత్యేక బస్సుల్లో క్యాంప్కు తరలివెళ్లారు. కొద్ది రోజులపాటు హైదరాబాద్లోని ఓ హోటల్లో బస చేసిన వీరంతా .. ఆ తర్వాత గోవాకు షిఫ్ట్ అయ్యారు. ఈ నెల 30న అవిశ్వాసం రోజునే తిరిగి కామారెడ్డికి రానున్నారు. అయితే,..అవిశ్వాసానికి సమయం దగ్గరపడటంతో రంగంలోకి బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ రంగంలోకి దిగినట్టు సమాచారం. తమ కౌన్సిలర్లతో మంతనాలు జరిపిన ఆయన.. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వొద్దని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఆలోచనలో పడ్డ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస మద్దతుపై పునరాలోచ చేస్తున్నట్టు సమచారం.
మరోవైపు ఇంతకాలం బీఆర్ఎస్లో కొనసాగి.. చైర్మన్కు మద్దతుగా నిలచిన కౌన్సిలర్లంతా ఒక్కొక్కరుగా చేజారి పోతుంటే ఏం చేయాలో దిక్కతోచక అయోమయంలో పడింది నెట్టు కుటుంబం. తమకు నమ్మిన వ్యక్తులుగా ఉన్న వాళ్ళు సైతం దొడ్డిదారిన కాంగ్రెస్కు సపోర్ట్ ఇవ్వడంతో అవిశ్వాస గండం నుంచి గట్టెక్కేదెలా అన్న మార్గా లను అన్వేషిస్తున్నారు. ఇటీవల జిల్ల కేంద్రంలోని సత్య గార్డెన్స్లో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కార్య కర్తల సమావేశానికి.. చైర్మన్ నిట్టు జాహ్నావి మినహా ఆయన తండ్రి వేణుగోపాల్, బాబాయ్ కృష్ణమోహన్రావు డుమ్మా కొట్టారు. దీంతో నెట్టు ఫ్యామిలీ పార్టీ మారడం పక్కా అన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే,.. పార్టీ మారడం కన్నా రాజీనామా చేయడమే శ్రేయష్కరమని నిట్టు కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చి నట్టు తెలుస్తోంది. కేటీఆర్ వ్యూహం పని చేయకపోతే రేపో మాపో రాజీనామా చేసి మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. రాజీనామా చేస్తే హుందాగా పదవి నుంచి తప్పుకున్నట్టు ఉంటుందన్న భావనలో ఉన్నారట చైర్మన్ నిట్టు జాహ్నవి. లేదంటే అవిశ్వాసం నెగ్గడం ద్వారా పదవి పోయిం దన్న అపవా దును మోయాల్సివ స్తుందని ఆలోచనలో పడ్డారట. దీంతో ఈ నెల 30న జరగబోయే అవిశ్వాసం నెగ్గుతుందా..? వీగిపోతుందా అన్న ఆసక్తి నెలకొంది.