దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఢిల్లీలోని రాణీ బాగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన స్లీపర్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం… బాధిత మహిళ పిటాంపురా స్లమ్ క్లస్టర్లో నివసిస్తూ మంగోల్పురిలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. మే 11 రాత్రి విధులు ముగించుకుని ఎప్పటిలాగే ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, సరస్వతి విహార్ బస్ స్టాప్ వద్ద ఒక స్లీపర్ బస్సు ఆగింది.
ఆ సమయంలో బస్సు వద్ద నిలబడి ఉన్న వ్యక్తిని మహిళ సమయం ఎంత అయ్యిందని అడిగింది. అనంతరం ఆమెను బలవంతంగా బస్సులోకి లాగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తర్వాత నిందితులు బస్సును నాంగ్లోయి వైపు తీసుకెళ్లి మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
బాధితురాలు వివాహిత కాగా ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఉపయోగించిన బస్సును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఈ ఘటన 2012లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ కేసును గుర్తు చేస్తోంది. అప్పట్లో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేసి రోడ్డుపై పడేసిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. తీవ్ర గాయాలతో బాధపడిన ఆమె.. తర్వాత సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.


