హైదరాబాద్లోని మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధిలో చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. గోకుల్ ప్లాట్స్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కర్నూలు జిల్లాకు చెందిన జనార్దన్ హైదరాబాద్లో ఉంటూ సీఏ చదువుతున్నాడు. అయితే తన గదిలో ఉరివేసుకున్న స్థితిలో అతను మృతిచెందినట్లు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
గదిలో రక్తపు మరకలు కనిపించడం ఈ కేసును మరింత అనుమానాస్పదంగా మార్చింది. జనార్దన్ తల్లిదండ్రులు తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఈ ఘటన వెనుక ఏదో కుట్ర ఉండొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మృతుడి కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. క్లూస్ టీంను ఘటనాస్థలికి రప్పించి గదిలోని ఆధారాలను సేకరిస్తున్నారు. మొబైల్ ఫోన్, వ్యక్తిగత వస్తువులు, రక్తపు ఆనవాళ్లను పరిశీలించారు.
జనార్దన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి( Gandhi Hospital)కి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు ఆత్మహత్యా? లేక అనుమానాస్పద మరణమా? అన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


