దేశ రాజధాని ఢిల్లీలో 2025 నవంబర్ 10న రెడ్ఫోర్ట్ సమీపంలో జరిగిన భారీ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక ముందడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై 7,500 పేజీల భారీ ఛార్జ్షీట్ను ఢిల్లీలోని పాటియాలా హౌస్ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసింది.
వాహనంలో అమర్చిన శక్తివంతమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ (VBIED) పేలుడుతో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఎన్ఐఏ దర్యాప్తు ప్రకారం… నిందితులంతా అల్ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) అనుబంధ ఉగ్ర సంస్థ అయిన అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ (AGuH) కు చెందినవారని వెల్లడించింది. అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), భారతీయ న్యాయ సంహిత, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టం, ప్రజా ఆస్తుల ధ్వంస నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీగా గుర్తించారు. ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన పేలుడులోనే మరణించాడు. డీఎన్ఏ పరీక్షల ద్వారా అతని గుర్తింపును నిర్ధారించారు.
మిగిలిన నిందితుల్లో ఆమిర్ రషీద్ మీర్, జాసిర్ బిలాల్ వాని, డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ షాహీన్ సయీద్, ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వగే, సోయబ్, డాక్టర్ బిలాల్ నసీర్ మల్లా, యాసిర్ అహ్మద్ దార్ పేర్లు ఉన్నాయి.
దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022లో శ్రీనగర్లో జరిగిన రహస్య సమావేశంలో ఈ ఉగ్రవాద సంస్థను “AGuH Interim” పేరుతో పునర్వ్యవస్థీకరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. టర్కీ మార్గంగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లే ప్రయత్నం విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
“ఆపరేషన్ హెవెన్లీ హింద్” పేరుతో భారత ప్రభుత్వాన్ని కూల్చి షరియా పాలన నెలకొల్పడమే ఈ సంస్థ లక్ష్యమని ఎన్ఐఏ పేర్కొంది. నిందితులు యువతను తీవ్రవాద భావజాలానికి ఆకర్షించడం, ప్రచారం చేయడం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వ చేయడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు వెల్లడించింది.
ఈ పేలుడులో ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ (TATP) అనే అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు ఎన్ఐఏ తెలిపింది. రహస్యంగా రసాయనాలు సేకరించి పలు ప్రయోగాలు నిర్వహించిన తర్వాత ఈ పేలుడు పదార్థాన్ని తయారు చేసినట్లు గుర్తించారు.
డ్రోన్ ఆధారిత, రాకెట్ ఆధారిత ఐఈడీలను కూడా ఈ మాడ్యూల్ పరీక్షించినట్లు దర్యాప్తులో బయటపడింది.
ఫోరెన్సిక్ ఆధారాలు, డీఎన్ఏ ప్రొఫైలింగ్, వాయిస్ అనాలిసిస్, ఢిల్లీ, ఫరీదాబాద్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న వస్తువులు ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి.
ఈ ఛార్జ్షీట్లో 588 మంది సాక్షుల వాంగ్మూలాలు, 395కు పైగా పత్రాలు, 200కుపైగా స్వాధీనం చేసుకున్న ఆధారాలను ఎన్ఐఏ సమర్పించింది.
ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేయగా… పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది.


