తెలంగాణలో మహిళా సాధికారతకు మరో కీలక అడుగు పడింది. దేశంలోనే చారిత్రాత్మక గుర్తింపు పొందిన సింగరేణి (Singareni Collieries Company Limited) సంస్థలో తొలిసారిగా మహిళలను భారీ డంపర్ ఆపరేటర్లుగా నియమించేందుకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది. 13 దశాబ్దాల సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి మహిళలకు ఓపెన్కాస్ట్ గనుల్లో భారీ డంపర్ల బాధ్యతలు అప్పగించబోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( A. Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క ( Bhatti Vikramarka Mallu) ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం చర్యలు ప్రారంభించింది.
ఇప్పటివరకు ఓపెన్కాస్ట్ గనుల్లో 60 నుంచి 100 టన్నుల సామర్థ్యం గల భారీ డంపర్లను నడిపే బాధ్యతలు పూర్తిగా పురుషులకే పరిమితమయ్యాయి. అయితే ఇప్పుడు మహిళలకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తూ సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది.
ఈ మేరకు మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా… మొదటిసారి 35 మంది మహిళలు ముందుకు వచ్చారు. వీరికి ప్రత్యేకంగా హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ శిక్షణను సింగరేణి యాజమాన్యం అందించింది.
సిరిసిల్లలోని టైడ్స్ సంస్థలో ఉచితంగా శిక్షణ ఇచ్చి భారీ వాహనాల నిర్వహణపై ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించారు. ఇందులో 13 మంది మహిళలు విజయవంతంగా హెవీ మోటార్ వెహికిల్ శిక్షణ పూర్తి చేశారు. త్వరలో విడుదల కానున్న డంపర్ ఆపరేటర్ పోస్టుల్లో వీరికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
సింగరేణిలో ఇప్పటికే మహిళలు క్లిష్టమైన బ్లాస్టింగ్ విభాగాల్లో సేవలందిస్తున్నారు. అలాగే మహిళా రెస్క్యూ బృందాన్ని కూడా యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఇప్పుడు భారీ డంపర్ల బాధ్యతలు కూడా మహిళలకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది.
“మహిళలు కూడా భారీ డంపర్లు సమర్థంగా నడపగలరు. మాకు అవకాశం ఇవ్వడం గర్వంగా ఉంది” అని శిక్షణ పూర్తి చేసిన మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకు మరిన్ని సాంకేతిక, క్లిష్ట బాధ్యతలు అప్పగించే దిశగా సింగరేణి ముందడుగు వేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయం తెలంగాణలో మహిళా సాధికారతకు కొత్త దిశను చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


