హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మధురానగర్లో ఉన్న భార్గవి లేడీస్ హాస్టల్ భవనం పైభాగంలోని టెర్రస్లో నివసిస్తున్న హారిక అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
టెర్రస్పై ఉన్న బాత్రూంలో హారిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం… హారిక మృతి చెంది రెండు రోజులు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు గుంటూరు జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు.
టెర్రస్పై ఒంటరిగా నివసిస్తున్న హారిక బాత్రూంలో పడిపోయి మృతి చెందినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి( Gandhi Hospital) కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


