లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార వ్యూహంపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రధాన పార్టీలన్ని ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో గులాబీ బాస్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 13న చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభతోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు లోక్సభ, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పార్టీ కేడర్, ముఖ్య నేతలతో జరుగుతున్న సన్నాహక, సమన్వయ భేటీల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. క్షేత్ర స్థాయిలో చేయాల్సిన ప్రచారం, ఎజెండా తదితరాలపై దిశా నిర్దేశం చేస్తున్నారు. చేవెళ్ల సభ అనంతరం ఈ నెల 15వ తేదీన మెదక్లోనూ కేసీఆర్ సభ జరగనుంది. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో గులాబీ దళపతి లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ దఫా ఎక్కువగా బస్సుయాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్తో పాటు కేటీఆర్,హరీశ్ రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఇదే సమయంలో పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. ఎండిన పంటల పరిశీలన సందర్భంగా సూర్యాపేట, సిరిసిల్లలో ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానికి కొనసా గింపుగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థి తులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పదేళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. బస్సు యాత్ర ద్వారా సుమారు వంద అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మినీ మీటింగులు లక్ష్యంగా, వీలైనన్ని మండలాలను కవర్ చేసేలా ప్రచారానికి రూట్ మ్యాప్, షెడ్యూలుపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 15 తర్వాత మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.


