ఏపీలో ఎన్నికల హడావిడి పీక్ స్టేజ్కు చేరిపోయింది. పార్టీలన్నీ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. పోలింగ్కు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ కావడంతో అన్ని పార్టీల అగ్రనేతలు ఎన్నికల వ్యూహాల్లో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో దూకుడు పెంచింది ఎన్డీయే కూటమి. ప్రజాగళం మూడో విడతలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రచా రాన్ని పరుగులు పెట్టించనున్నారు.దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా వేడెక్కింది. అంతేకాదు రెండు పార్టీల అగ్రనేతలు ఒకే వేదికపై ప్రచారం చేయడంతో ఆ పార్టీల కేడర్లో కొత్త జోష్ కనిపించ నుంది.
ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది.మే13న ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రజల బాట పట్టాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పోలింగ్కు టైం దగ్గర పడు తుండడంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు..ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వ్యూహం మార్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహిం చనున్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత..గత నెల 17న చిలకలూరిపేటలో తొలి బహిరంగసభను నిర్వహించారు. ఈ సభకు మూడు పార్టీల అగ్రనేతలు ప్రధాని మోదీ, చంద్రబాబ, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగసభలో పాల్గొన లేదు. చంద్రబాబు ప్రజాగళం పేరుతో 25 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. అటు వారాహి విజయ యాత్రతో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే మూడో విడత ప్రజాగళంలో చంద్రబాబు- పవన్ కలిసి పాల్గొననున్నారు.
ఈ నెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం చేస్తారు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇప్పటివరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు..ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ వేడెక్కనుంది. అంతేకాకుండా చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించనుంది. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు అధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షం ఎవరికి వారు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..


