” మేము సిద్ధం” పేరుతో ఎన్నికల ప్రచారానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. సిద్ధం మహాసభల స్ఫూర్తితో .. ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈనెల 27 తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభయే అవకాశం ఉన్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలో ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. మే 13న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి . ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు ప్రాంతాల్లో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించారు సీఎం జగన్. ఎన్నికలకు కొంత సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ” మేము సిద్ధం” పేరుతో ఈ బస్సు యాత్ర చేసేందుకు వైసిపి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 21 పార్లమెంట్ స్థానాల్లో ఈ బస్సు యాత్ర కొన సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం బహిరంగ సభలో జరిగిన నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాలలో బస్ యాత్ర కొనసాగనుంది.
ఈనెల 27 తేదీ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇడుపుల పాయ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుంది. దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఉదయం పార్టీ నేతలు, మేధావులతో సీఎం జగన్ సమావేశం అవుతారు. సాయంత్రం భారీ బహిరంగ సభను పార్లమెంటు నియోజక వర్గం కేంద్రంలో నిర్వహిస్తారు. వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వైసిపిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. దీంతో ఎన్డీఏ కూటమే లక్ష్యంగా సీఎం జగన్ విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. గతంలో నిర్వహించిన సిద్ధం సభలకు వైసిపి కేడర్ నుంచి మంచి స్పందన లభించింది .దీంతో జగన్ బస్సు యాత్రకు వైసిపి నుంచి మంచి స్పందన వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలోను సిద్దం తరహాలోనే సభలు నిర్వహించేందుకు వైసిపి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థులు వారివారి నియోజకవర్గాల్లో ప్రచారం కూడా సాగిస్తున్నారు. మరోపక్క వైఎస్ జగన్ బస్సుయత్రతో ఎన్నికల ప్రచారాన్ని సిద్ధమవుతున్నారు .అంతకంటే ముందే ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలనే అంశానికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలని 99 శాతం హామీలు అమలు చేశామంటున్న వైసిపి వచ్చే ఎన్నికల్లో ప్రజాకర్షక హామీలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.


