వైఎస్ఆర్ సిపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమించారు. అమరావతిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం శాసన సభా పక్షం భారీ ప్రదర్శన చేపట్టింది. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం కుదేలయిందని నాయకులు నినాదాలు చేశారు. ఉపాధి లేక నిరుద్యోగుల ఆకలి కేకలు, రక్షణ లేక మహిళల ఆర్తనాదాలతో రాష్ట్రం దద్దరిల్లుతోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని వారు ఊరేగింపుగా అసెంబ్లీకి తరలివచ్చారు. రాష్ట్రంలో దారులు అధ్వాన్నంగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అయినా జగన్ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని నాయకులు ఆరోపించారు.


