స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాయలసీమ ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ తీరని అన్యాయం చేశారన్నారు. రాయలసీమకు అన్యాయం చేస్తున్నందుకు జగన్కు సిగ్గనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి కోసం దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయన్నారు. రాయలసీమ అభవృద్ధి ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గంగ ప్రాజెక్ట్తోనే ప్రారంభమైందన్నారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలుగుదేశం హయాంలో రూ.68,293 కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.22,165 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఇరిగేషన్ శాఖను వైసీపీ భ్రష్టు పట్టించిందని టీడీపీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ పక్క ప్రాజెక్టులు కట్టకుండా రాయలసీమకు అన్యాయం చేస్తూనే.. మరో వైపు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను రక్షించ లేకపోతున్నారన్నారు. నిర్వహణ సరిగా లేక.. ఇసుక మాఫియాలో అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయిందని తెలిపారు. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు పేరుతో భారీ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా 198 ప్రాజెక్టులు.. రాయలసీమలో 102 ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేసేశారన్నారు. మరో ఐదేళ్ల వరకు టెండర్లు పిలవొద్దని జీవో జారీ చేస్తారా?… ఇంతటి దారుణానికి పాల్పడిన జగన్ రాయలసీమ ద్రోహి కాదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


