స్వతంత్ర వెబ్ డెస్క్: దులీప్ ట్రోఫీ 2023 లో సౌత్ జోన్ ఫైనల్ కు చేరింది. సమష్టిగా రాణించి తుది పోరుకు అర్హత సాధించింది. నార్త్ జోన్ తో జరిగిన ఫైనల్ పోరులో రెండు వికెట్ల తేడాతో నెగ్గిన సౌత్ జోన్ టైటిల్ రేసులో నిలిచింది. 215 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌత్ జోన్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన సౌత్ జోన్.. వెస్ట్ జోన్ తో టైటిల్ కోసం తలపడనుంది. ఈ మ్యాచ్ విజయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ముఖ్య పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో సౌత్ జోన్ 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన తిలక్ వర్మ.. మయాంక్ అగర్వాల్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 101 బంతుల్లో 46 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ తో కలిసి ఐదో వికెట్ కు 110 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. నార్త్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్ లో 198 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌత్ జోన్ 195 పరుగులు చేసింది. ఫలితంగా నార్త్ జోన్ కు 3 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో నార్త్ జోన్ 211 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ మూడు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని.. సౌత్ జోన్ కు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
రెండో ఇన్నింగ్స్ లో మరోసారి మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ హనుమ విహారి (43), రికీ భుయ్ (34) రాణించారు. అయితే వీరంతా వెంట వెంటనే అవుటయ్యారు. దాంతో మరోసారి సౌత్ జోన్ ఒత్తిడిలో పడింది. ఈ దశలో తిలక్ వర్మ (25) వికెట్లను అడ్డుకున్నాడు. దాంతో సెట్ అయిన సౌత్ జోన్ 2 వికెట్ల తేడాతో నార్త్ జోన్ పై నెగ్గి ఫైనల్ కు చేరింది. వెస్టిండీస్ తో జరిగే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కు తిలక్ వర్మ ఎంపికైన సంగతి తెలిసిందే. టీమిండియాకు ఎంపికైన తర్వాత దులీప్ ట్రోఫీలో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కీలక ఇన్నింగ్స్ లు ఆడటం విశేషం.