స్వతంత్ర వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం తెల్లవారుజామున 3.30 గంటలకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు బారులు తీరారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం మొత్తం ఆరు క్యూలను ఏర్పాటు చేశారు. బాటా చౌరస్తా నుంచి ఆలయానికి వచ్చే లైను ఎంజీ రోడ్డు రాంగోపాల్పేట పాత పోలీస్స్టేషన్ కొత్త ఆర్చి గేట్ నుంచి మహంకాళి పోలీస్ స్టేషన్ మీదుగా ఆలయానికి వెళ్లాలి. సికింద్రాబాద్ జనరల్ బజార్ వీఐపీల కోసం 1 క్యూ, అంజలి టాకీస్ వైపు నుంచి సాధారణ భక్తుల కోసం 1 క్యూ ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎంజీ రోడ్డు పాత రాంగోపాల్పేట పీఎస్ నుంచి నిత్యం భక్తుల కోసం క్యూ ఉంటుంది. డోనర్ పాస్ల కోసం ఎంజీ రోడ్డులో ఆలయం వెనుక నుంచి మరో క్యూ ఉంది. పాత రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంజీ రోడ్డు నుంచి అమ్మవారి ఆర్కిగేట్ మీదుగా వీవీఐపీలను అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
బోనాల పండుగ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నగరంలోని దాదాపు 19 ప్రాంతాల నుంచి సిటీ బస్సులను బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాలకు మళ్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బోనాల జాతరకు హాజరయ్యే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు, బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్ వైపు నుంచి వెళ్లే ట్రాఫిక్ను నేడు, రేపు ప్రత్నామ్నాయ మార్గాల గుండా మళ్లిస్తున్నారు. పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు గాను మహంకాళి పోలీసు స్టేషన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూంని.. పోలీసు కామాండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం చేసి సీసీ కెమెరాల నిఘా పెంచారు. సుమారు 5లక్షల మంది బోనాలు సమర్పించనున్నట్లు ప్రభుత్వం అంచనావేసింది. నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ సర్వీసుల ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ బోనం సమర్పించనున్నారు.