స్వతంత్ర వెబ్ డెస్క్: అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు.
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మంగళ వాయిద్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. వందల ఏళ్లుగా బోనాల పండగ పరంపర కొనసాగుతోందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున దర్శనానికి వస్తున్నారని అన్నారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. నీతి నిజాయితితో పాలన ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి పరిపాలన వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.