స్వతంత్ర వెబ్ డెస్క్: రానున్న మూడు రోజుల్లో భాగ్యనగరానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారులు కూడా సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్య ఇవ్వాలని అధికారులను కోరిన మంత్రి.. అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. సమస్యలపై వార్డు కార్యాలయాన్ని సందర్శించిన పలువురితో తాము స్వయంగా ఫోన్లో మాట్లాడామన్న అధికారులు.. వార్డు కార్యాలయం వ్యవస్థ పట్ల పౌరులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డుల పరిధిలో ఉన్న కాలనీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, ఇతర సంఘాల సహకారంతో కూడా వార్డు కార్యాలయ వ్యవస్థకు మరింత ప్రచారం కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు.