స్వతంత్ర వెబ్ డెస్క్: దేశంలో బలమైన ఆర్ధిక శక్తిగా తెలంగాణ ఎదిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. నాలుగేళ్లలో జిఎస్టి వసూళ్లలో రాష్ట్రం 69 శాతం వృద్ధి రేటును సాధించడం ద్వారా ఇది స్పష్టమవుతోందని అన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కి సమర్పించిన తాజా నివేదిక ప్రకారం, తెలంగాణ జిఎస్టి ఆదాయం 2018-19లో రూ. 28,786 కోట్ల నుండి 2022-23 నాటికి రూ. 41,889 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు రూ. 13,103 కోట్ల వసూళ్లను పెంచుకుంది.
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జీఎస్టీ వసూళ్లలో ఆశాజనక ధోరణిని కొనసాగించగలిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణకు జీఎస్టీ ఆదాయంలో రూ. 28,786 కోట్లు వచ్చాయి. తెలంగాణ బడ్జెట్ అంచనా రూ. 34 వేల 232 కోట్లుగా ఉండగా అందులో 84 శాతం సాధించింది. ప్రపంచమంతా మహమ్మారి ప్రతికూల ప్రభావంతో కొట్టుమిట్టాడుతుండగా, లాక్డౌన్ల సమయంలో కూడా తెలంగాణ తదుపరి సంవత్సరాల్లో వృద్ధి పథంలో కొనసాగింది. 2019-20లో అంచనా వసూళ్లు రూ.31,186 కోట్లు కాగా, బడ్జెట్ అంచనాల్లో 90 శాతం వాటాతో తెలంగాణ రూ.28,053 కోట్లు వసూలు చేయగలిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 32,671 కోట్ల అంచనా కాగా 80 శాతం అంచనాలను అందుకుంటూ రూ. 25,905 కోట్ల సేకరణ జరిగింది. 2021-22లో రాష్ట్రం రూ. 35,520 కోట్లు అంచనా వేయగా రూ.34,489 కోట్లు వసూలు చేసింది. 2022-23 లో అంచనా వసూళ్లు రూ. 42 వేల 189 కోట్లు కాగా అది 90 శాతం సాధిస్తూ రూ. 41, 889 కోట్లకు చేరింది.