పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడు కూడా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తి అయిన తరువాత కూడా పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవలు పడుతున్నారు. పల్నాడు జిల్లాలో హింసాత్మక సంఘటనలు ఎక్కువ కావడంతో ఆ జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఏపీ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలు రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. దీంతో 144 సెక్షన్ విధింపునకు ఈసీ నిర్ణయం తీసుకుంది. నరసరావుపేట లోక్సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ సెక్షన్ అమల్లో ఉంటుంది.
పల్నాడు జిల్లాతో పాటు తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలోని సమస్యాత్మాక అసెంబ్లీ నియోజక వర్గాలపై ఈసీ నిఘా వేసింది. ఇప్పటికే సంబంధిత జిల్లా అధికారులు, పోలీసు శాఖతో మాట్లాడిన ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది.