తెలంగాణ రాజకీయాల్లో ఆ ఎంపీ సీటు అంటేనే హాట్ కేకులా తయారైందా అంటే అవునన్న సమాధానమే విన్పి స్తోంది. రిజర్వుడు సీటు కావడంతో ఎవర్ని బరిలో దింపాలా అని అధికార కాంగ్రెస్ ఆలోచనలు చేస్తుంటే… స్నేహ ధర్మం పాటించాలని సీపీఐ అంటోంది. మరి.. ఒక వేళ అదే జరిగి కమ్యూనిస్టులకు ఆ పార్లమెంటు స్థానం దక్కితే పోటీ చేయబోయేది ఎవరు ? ఇప్పటికే ఎవరైనా సిద్ధంగా ఉన్నారా ? ఇలా ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా ఎన్నో ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. ఇవన్నీ తర్వాత.. అసలు ఆ స్థానం ఏంటి ? దానికి ఎందుకంత ప్రత్యేకత ? ఈ స్టోరీలో చూద్దాం.
లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఎన్డీఏ కూటమిని ఢీ కొట్టాలంటే మెజార్టీ ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యమన్న సంగతి కాంగ్రెస్కు తెలియంది కాదు. అందుకే రాష్ట్రంలో హస్తం పార్టీ ఇటీవలె అధికారంలోకి రావడంతో సానుకూల పవనాలు వీస్తున్నాయన్న అంచనాతో ఉన్నారు రాష్ట్ర కాంగ్రెస్పెద్దలు. దీంతో..ఆ జోరును కొనసాగించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ పార్లమెంటు స్థానాల్లో విజయ భేరి మోగించి హస్తం హైకమాండ్కు బహుమతిగా ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంటు స్థానాల వారీగా సర్వేలు, కుల సమీకరణాలు, స్థానిక సమస్యలపై దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ. ఇతర నియోజక వర్గాల సంగతి కాసేపు పక్కన పెడితే.. తెలంగాణలోనే హైదరాబాద్ మహా నగరం తర్వాత పెద్దది, చారిత్రకంగా చూసినా ఎంతో ప్రాధాన్యం ఉన్న నగరం వరంగల్. ఉద్యమాల గడ్డగా పేరు పొందిన వరంగల్ ఎంపీ సీటుపై హస్తం పార్టీ
ఫోకస్ పెట్టింది. ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు సీటుగా ఉన్న వరంగల్లో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ ఎంపీ ఉన్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో ఓరుగల్లుపై కాంగ్రెస్ జెండా పాతాలని వ్యూహాలు సిద్దం చేస్తున్నారు హస్తం నేతలు.
నిజానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉన్నప్పటికీ రిజర్వ్డ్ సీటు కారణంగా కాస్త ఇబ్బందు లు తలెత్తుతున్నాయన్న వాదన పార్టీలోనే విన్పిస్తోంది. కాంగ్రెస్ తరఫున బలమైన ఎస్సీ నేతలు, ప్రజల్ని తమ వైపు ఆకట్టుకునేలా చేయగల లీడర్లు, ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టగల ఛర్మిష్మా ఉన్న నేతల సంఖ్య కాస్త తక్కువన్న అభిప్రాయం స్థానిక నేతల్లోనే వ్యక్తమవుతోంది. పోనీ, ఎస్సీ నేతలు బలంగా ఉన్న ఇతర నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ బరిలో దింపుదామా అంటే నాన్ లోకల్ అన్న నినాదం తలెత్తి మొదటికే మోసం వస్తుందన్న డౌట్ విన్పిస్తోంది. దీంతో..ఏం చేయాలా అన్న దానిపై సుదీర్ఘ చర్చల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలు.
కాంగ్రెస్ పార్టీలో ఇలా తర్జన భర్జనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే కమ్యూనిస్టులు వరంగల్ ఎంపీ స్థానంపై దృష్టి సారించారాన్న టాక్ విన్పిస్తోంది. ఇప్పటికే పొత్తులో భాగంగా తెలంగాణలో ఒక స్థానం తమకు తప్పకుండా కేటాయించా లని అడుగుతోంది సీపీఐ. ఇందుకోసం ఐదు స్థానాల పేర్లు ప్రతిపాదించారు కమ్యూనిస్టులు. వరంగల్, మహబూబా బాద్, ఖమ్మం, నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కసరత్తులు గమనించి.. వరంగల్పైనే సీపీఐ నేతలు ప్రధానంగా గురిపెట్టారు అన్న టాక్ విన్పిస్తోంది.
ఒక వేళ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీపీఐకి ఈ స్థానం కేటాయించేందుకు అంగీకరిస్తే.. ఎవరు పోటీ చేస్తారు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ క్రమంలోనే సీపీఐ తరుపున కమ్యునిస్టు యోధుడు.. దివంగత నేత భగవాన్ దాస్ తనయుడు సీనియర్ జర్నలిస్ట్ బీఆర్ లెనిన్ పేరు ప్రచారానికి వచ్చింది. ఇప్పటికే పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆయన పోటీపై జోరుగా ప్రచారం సాగుతోంది. భగవాన్ దాస్కు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక గుర్తిపు ఉంది. కోచ్ ఫ్యాక్టరీ సాధన ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకుడాయన. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ట్రేడ్ యూనియన్లను నెలకొల్పడంలో కామ్రేడ్ భగవాన్ దాస్ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలు దృష్టిలో పెట్టుకున్న సీపీఐ అధిష్టానం ఆయన తన యుడు బీఆర్ లెనిన్కు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీనియర్ జర్నలి స్టుగా ఉన్నబీర్ లెనిన్కు అన్ని పార్టీలతో మంచి సంబంధాలే ఉన్నాయి. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్లో రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్నారాయన. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీ రోల్ పోషించిన నాయకుడిగానూ
ప్రత్యేక గుర్తింపు ఉందారు లెనిన్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలతో లెనిన్కు సత్సంబంధాలు ఉండటం, ఆయన తండ్రి భగవాన్ దాస్ చేసిన సేవలు పేద ప్రజానీకంలో ఇంకా గుర్తుండడం వంటి అంశాలు పార్టీకి కలిసి వస్తాయని లెక్కలేస్తోంది సీపీఐ.
ఇటీవలె హైదరాబాద్లో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశల సందర్భంగా వరంగల్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి అడగాలని తీర్మానం సైతం చేసినట్లు తెలుస్తోంది. ఇక, పార్టీ సీనియర్ నేత డి. రాజా సైతం బీఆర్ లెనిన్ను ప్రత్యేకంగా పిలిపించుకొని పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు కమ్యూనిస్టు నేతల్లోనే ప్రచారం జరుగుతోంది. మరి. ..సీపీఐ అడగడం వరకు సరే.. కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా వరంగల్ ఎంపీ సీటును త్యాగం చేసేందుకు సిద్ధపడుతుందా లేక మరో సీటును కేటాయిస్తారా..? ఈ అంశంలో ఏం జరగబోతోంది అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.