ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యింది. ఇక్కడ ఏకంగా 88.52% శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల గణాంకాలు వెల్లడించాయి. భారీ పోలింగ్ తమకు ప్రయోజనం అంటే తమకు ప్రయోజనం అని తామే గెలుస్తామని వైసీపీ, టీడీపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
కళ్యాణ దుర్గం…అంటే సంస్కృత అర్థం ప్రకారం మంచి కోట.. అసెంబ్లీ ఎన్నికల ఆటలో ఈ మంచి కోటలో పాగా వేయడానికి అటు వైసీపీ, ఇటు టీడీపీ హోరా హోరీగా ప్రయత్నాలు సాగించాయి. ఇరు పార్టీల అభ్యర్థులు కళ్యాణ దుర్గం కోటలో తామే పాగా వేస్తామని చెబుతున్నారు. వీర లెవెల్లో ఇక్కడ పోలింగ్ జరగడంతో ఉమ్మడి అనంతరపురం జిల్లావాసులందరూ కళ్యాణ దుర్గం అసెంబ్లీ నియోజకవర్గంపైనే చూపు సారిస్తున్నారు.
నలభై రోజుల పాటు నువ్వా, నేనా అన్నరీతిలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సాగించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్త య్యింది. ఈవీఎంలలో ప్రజా తీర్పు భద్రంగా ఉంది. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో సైతం అభ్యర్థుల భవితవ్యం ఈవిఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు ఈవిఎంలలో భద్రంగా ఉన్న ఓట్లను అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. అయితే, ఈ నియోజకవర్గంలో ఓ విషయం ఎమ్మెల్యే అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది. అదేమి టంటే, ఎన్నడూ లేని విధంగా ఈ మారు భారీగా పోలింగ్ శాతం నమోదయ్యింది. ఎన్నికల పోలింగ్ రోజున సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్లలో ఉన్న అందరికీ ఓటు వేసే హక్కు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రీతిన చర్యలు చేపట్టింది. దీంతో, అర్థరాత్రి వరకు ఎందరో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. దీంతో, పోలింగ్ శాతం సైతం విపరీతంగా పెరిగింది.
పోలింగ్ శాతం పెరగడంపై అటు అధికార పార్టీ, ఇటు విపక్ష పార్టీ ఎవరి లెక్కలు వారు వేసుకుని.. గెలుపు తమదే అని ధీమాగా చెబుతున్నారు. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలందరికీ చేరాయని, దీంతో..ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకున్నారని, పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం తమ ప్లస్ పాయింటని అధికార వైసీపీ అభ్యర్థులు తెలియజేస్తున్నారు.
అర్థరాత్రి వరకు ఓపిగ్గా ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారంటే, ప్రభుత్వంపై ఎంతగా వ్యతిరేకత ఉందో అర్థం అవుతోందని విపక్ష నేతలు చెబుతున్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగించిన ప్రభుత్వాన్ని గద్దె దింపడానికే పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి ఓటు వేశారని, దూర ప్రాంతాల నుంచి సైతం ఎందరో ఓటర్లు వచ్చి ఓటు వేశారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
వైసీపీ నేతలు బూత్ ల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించుకుని మెజార్టీ లెక్కలు వేసుకుని గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం లో ఐదు మండలాలు, మున్సిపాల్ ను కలిపితే రెండు లక్షల 30 వేల 785 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో రెండు లక్షల 4 వేల 297 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. ఇక్కడ రికార్డ్ స్థాయిలో 88.52% శాతం పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో 1,02,459 మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా 1,01,835 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధికంగా పోలింగ్ శాతం కళ్యాణదుర్గం నియోజవర్గం లోనే నమోదై నట్టు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు.
ఇంత ప్రతిష్ఠాత్మకంగా ఉన్న కళ్యాణ దుర్గం నియోజకవర్గంపై వైసీపీ నేతలు, టీడీపీ నేతలు మండలాల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. తమదే గెలుపు అని సంబర పడిపోతున్నారు. దీంతో, ఇరు పార్టీల కార్యకర్తలు ఉత్సాహం చెందుతున్నారు. విజయం తమదంటే తమదే అని వాదులాడు కోవడంతోనే సరిపెట్టుకోవడం లేదు, పెద్ద ఎత్తున పందేలు కాయడానికి రెడీ అంటూ సంకేతాలు పంపుతున్నారు.
కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉషశ్రీ చరణ్ గెలుపొం దారు. 2014 లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నం హనుమంతరాయచౌదరి గెలిచారు. తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సంక్షేమ పథకాలు తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్యను తప్పక గెలిపిస్తాయని వైసిపి నేతలు ధీమాగా చెబుతున్నారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గ ఓటర్లు ఎవరి వైపు ఆసక్తి చూపారో.? ఎవరిని గెలిపించనున్నారో..? ఎవరిని పరాజయం పాలు చేయనున్నారో అంతా సస్పెన్స్. ఈ నియోజవర్గం భవితే కాక, రాష్ట్ర భవిత, దేశ భవిత తెలియాలంటే జూన్ 4 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


