గ్రేటర్లో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. ఒకే రోజు సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే పార్టీకి గుడ్బై చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరపున ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన దానం నాగేందర్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశమున్నట్లు సమాచారం. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. వీరిద్దరు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి దీపదాస్ మున్షీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మరింత మంది నగర ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ రాజధాని పరిధిలో మూడు ఎంపీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో అడుగులు వేస్తోంది. దీంతో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఎన్నికల భేరీ మోగడంతో కాంగ్రెస్లోకి గేట్లు తెరిచామని సీఎం రేవంత్రెడ్డి అనడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ నుంచి మరింత మంది టచ్లో ఉన్నారనే ఊహగానాలు ఊపందుకున్నాయి.
మాజీ మంత్రి మల్లారెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ను కలవడం వంటి పరిణామాలతో ఆయన కాంగ్రెస్లోకి మారతారనే ఊహగానాలు విన్పిస్తున్నాయి. ఆయన నివాసంలోనే మల్కాజిగిరి BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం అయ్యారు. మల్లారెడ్డి బీఆర్ఎస్లో ఉండాలా? పార్టీ మారాలా అనే ఊగిసలాటలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీ మారుతున్న నేతలు సాధారణంగా కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెబుతుంటారు. ఇందుకు భిన్నంగా కొందరు నేతల తీరు ఉండటంతో నాయకుల అనుచరులు గుర్రుగా ఉన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆయన ముఖ్య అనుచరులు వాపోయారు. పార్టీకి జిల్లా అధ్యక్షులు ఉన్నా అంతా అధిష్ఠానం చూసుకుంటుందిలే అన్న ధోరణిలోనే వారు ఉన్నారు. వీటి ప్రభావం రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.