ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. మూడు నెలల్లో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడడం ఖాయమని అన్నారు. దానం పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిశారు. తమ పార్టీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసినట్టు కౌశిక్రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం కండువా కప్పుకున్నారు. అయితే, దానంకు మంత్రి పదవి రాబోతోందనే ప్రచారం జోరందుకుంది. సీఎం రేవంత్ మంత్రి పదవి ఇస్తామన్న హామీ మేరకే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పలువురు గులాబీ ముఖ్య నేతలు కాంగ్రెస్ గూటికి చేరిపోగా.. మరికొందరు నేతలు ఫిరాయింపు చర్చల్లో ఉన్నట్టు సమాచారం.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఆయనపై అనర్హత పిటిషన్ సమర్పించేందుకు సిద్దమైంది. అందుకోసమని.. స్పీకర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. దీంతో స్పీకర్ నిన్న సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ కలిసి వెళ్లారు. అయితే.. సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ.. రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా తమను కలవలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. ఇవాళ మరోసారి స్పీకర్ ను కలిసి దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరనున్నారు నేతలు.