తనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) చేసిన ఆరోపణలను వరంగల్ సీపీ రంగనాథ్(CP Ranganath) గట్టిగా తిప్పికొట్టారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో తాను సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. విజయవాడ సత్యంబాబు కేసులో తాను దర్యాప్తు అధికారిగా లేనని ఆయన స్పష్టం చేశారు. తనపై ఏ ఆరోపణలు అయితే చేశారో వాటన్నింటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా తన ఉద్యోగ ధర్మం చేసుకుంటూ వెళ్తానని తెలిపారు. ఎవరి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కానని రంగనాథ్ వెల్లడించారు.
వరంగల్ లో టెన్త్ పేపర్ లీకేజీ జరగలేదని.. మాల్ ప్రాక్టీస్ జరిగిందన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ ను అందరికీ సర్క్యూలేట్ చేశారన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే బండి సంజయ్ ను అరెస్ట్ చేశామని రంగనాథ్ పేర్కొన్నారు. కాగా తనపై లేనిపోని ఆరోపణలు చేసిన రంగనాథ్(CP Ranganath) పై పరువు నష్టం దావా వేస్తానని సంజయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో విధులు నిర్వర్తించినప్పుడు అవినీతికి పాల్పడ్డారని కూడా ఆరోపణలు చేశారు సంజయ్.