పిఠాపురం తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై స్వయంగా వర్మ స్పందిస్తూ పార్టీ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటానని అన్నారు.
టీడీపీ హైకమాండ్ ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్త సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వర్మను ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించి, నియోజకవర్గ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే దిశగా అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై స్పందించిన వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో రకరకాల సమీకరణాలతో మార్పులు జరుగుతుంటాయి. చివరికి పార్టీ బాగుండాలనే ఉద్దేశ్యంతోనే నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను పూర్తిగా సహకరిస్తాను.. అని తెలిపారు.
అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని వర్మ వెల్లడించారు. లోకేష్తో చర్చించిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటు నిర్ణయం జరిగింది. ఇక్కడ పార్టీ వ్యవహారాలను నాయకులే నిర్వహిస్తారు… అని స్పష్టం చేశారు.
పిఠాపురం రాజకీయాలకు ప్రస్తుతం ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాజకీయాల్లో ఈ ప్రాంతం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ నిర్మాణంలో మార్పులు చేయడం వెనుక వ్యూహాత్మక కారణాలున్నాయనే చర్చ జరుగుతోంది.
త్వరలోనే పిఠాపురం నియోజకవర్గ టీడీపీ వ్యవహారాలను పర్యవేక్షించే ప్రత్యేక కమిటీని పార్టీ ప్రకటించే అవకాశముందని సమాచారం. ఈ కమిటీలో స్థానికంగా బలమైన నేతలకు చోటు కల్పించే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


