రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారించారు. సుమారు రెండు గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. గోదాం నుంచి బియ్యం ఎందుకు బయటకు వెళ్లిందనే దానిపై ఆమెను పోలీసులు ప్రశ్నించారు. గోడౌన్లో స్టాక్ తగ్గటానికి కారణాలపై ఆరా తీశారు. పేర్ని జయసుధ విచారణకు సహకరించారని విచారణాధికారి అన్నారు. అవసరమైతే జయసుధను మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పారు.
కృష్ణా జిల్లా బందరు తాలూకా పోలీసులు ఆమెను రెండు గంటల పాటు ప్రశ్నించారు. రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ ఏ1గా ఉన్నారు. ఈ కేసులో విచారణకు రావాలని పేర్ని జయసుధకు మంగళవారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. తన లాయర్లతో కలిసి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అయితే జయసుధ తరపు లాయర్లను పోలీసులు అనమతించలేదు. పేర్ని జయసుధను ఆర్ పేట సీఐ ఏసుబాబు విచారించారు.
మచిలీపట్నం మేయర్ కారులో పేర్ని జయసుధ విచారణకు రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ వాహనంలో ఆమె రావడం చర్చనీయాంశమైంది.
నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి వెళ్లిన సమయంలో పేర్ని జయసుధ ఇంట్లో లేరు. దీంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి పోలీసులు వెళ్లిపోయారు. ఈ కేసులో ఇప్పటికే పేర్ని జయసుధకు జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అతికించారు.