మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో మూడు రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫలితాల ప్రభావం ఆ పార్టీల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనున్న నేపధ్యంలో చావో రేవో తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటీవల వరకు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్లు అధిక స్ధానాల్లో గెలుపు ద్వారా రాష్ట్రంలో తమ స్ధానాన్ని సుస్ధిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.
పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు రాకపోతే.. ప్రభుత్వ మనుగడకు ప్రమాదకరమని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లు అవుతుందని పార్టీలో చర్చ నడుస్తోందట. అటు ప్రభుత్వంలోను భిన్నస్వరాలు వినిపించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. అందుకే మొత్తం 17 స్ధానాల్లో 10కి పైగా సీట్లు గెలవడం ద్వారా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్తోనే ఉన్నారన్న విషయాన్ని మరోసారి రుజువు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు కనపడుతోది. సభలు, సమావేశాలతోపాటు శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కొన్నింటిని నెరవేర్చగా మరికొన్నింటిపై స్పష్టమైన హామీ ఇచ్చి ప్రజలను తమవైపే నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఉన్న నేతలతో సమన్వయం చేసుకుంటూ ఐక్యత ద్వారా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు మెజార్టీ స్ధానాలు గెలవకపోతే కాంగ్రెస్లో ఉన్న పాత సంస్కృతి మరోసారి ఊపిరి పోసుకుంటుందన్న టెన్షన్ పార్టీ పెద్దలో కూడా కనిపిస్తోందనే టాక్ వినపడుతోంది.
ఇక మొన్నటి ఎన్నికల వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరిస్ధితి కాస్త గందరగోళంగా ఉంది. ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నా రైతు బంధు, ఫించన్ పెంపు, పంటల పరిహారం తదితం అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నా ప్రజలు బీఆర్ఎస్ మాటలను ఏ మేరకు విశ్వసిస్తారన్నది తేలాల్సి ఉంది. 17 స్ధానాలను అభ్యర్ధులను ప్రకటించినప్పటికి ఇప్పటి వరకు ఏ స్ధానంలోనూ, ప్రచారం లోనూ కారు పార్టీ ముందంజలో ఉన్నట్లు కనపడటంలేదు. రాజకీయ పార్టీలకు గెలుపు ఒక టానిక్ లాంటిది. గెలుపుతో రాజకీయాల్లో అనేక మలుపులను చవిచూసి సుస్ధిరతను సాధించవచ్చు. శాసనసభ ఎన్నికల్లో మాదిరి ఇక తన గెలుపునకు ఢోకా లేదని అహం ప్రదర్శించి భంగపడిన విషయాన్ని గుర్తుంచుకుని పని చేస్తే భవిష్యత్తులో తెలంగాణలో గులాబీ పార్టీకి మనుగడ ఉంటుంది. లేదంటే ఆ స్ధానాన్ని మరో పార్టీతో భర్తీ చేయడం ప్రజలకు కొత్తేమీ కాదనే విషయాన్ని గమనించాలనేది విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు 400 ప్లస్ సీట్లను టార్గెట్గా పార్టీ పెట్టుకున్నారు కమలనాథులు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో సీట్లు గెలవగలిగితే వారనుకున్న టార్గెట్ను రీచ్ అవ్వొచ్చని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణను పార్టీ ఎంచుకుంది. అందుకే అగ్ర నేతల పర్యటనలు తరచూ ఉండేలా కాషాయ పార్టీ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా ఓటర్ల అటెన్షన్ మొత్తం బీజేపీ వైపు పడేలా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరవుతున్నారు. మొత్తానికి మూడు ప్రధాన పార్టీలు తక్కువేం కాదన్నట్లు వ్యవహరించ డంతో తెలంగాణ రాజకీయా లు రక్తికట్టిస్తున్నాయి. అయితే నియోజకవర్గాల ప్రజలు మాత్రం ఆచితూచి తీర్పు ఇచ్చేందుకు సిద్ధమవుతు న్నారు. మరి ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో వేచి చూడాలి.


