నియోజక వర్గాల్లో నేతల మధ్య విభేదాల పై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. అసమ్మతి నేతలను పిలిచి బుజ్జగించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు అధిష్ఠానం తెలియజేసింది. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో ఎంత కర్చు పెట్టుకొగలరు, పార్టీ నుంచి ఎలాంటి సాయం ఆశిస్తున్నారనే అంశాలను పోటీ చేసే అభ్యర్థుల నుంచి అధిష్ఠానం పెద్దలు అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం.
విపక్షాలు పొత్తులు, ఎత్తుల్లో లీనమైవుండడంతో, ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిపై వైసీపీ దృష్టి సారించింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర నేతల తో భేటీ అయిన వైసీపీ పెద్దలు తాజాగా, గోదావరి, రాయలసీమ జిల్లాలకు చెందిన వారిని పిలిచి మాట్లాడారు. ప్రధానంగా నియోజక వర్గంలో ఉన్న అంతర్గత విభేదాల పై పార్టీ పెద్దలు దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో తమ వ్యతిరేకులకు టికెట్ ఇవ్వ వద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే, ఆ అభ్యర్థులను ఓడిస్తామని అసమ్మతి వాదులు బహిరంగం గానే హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజక వర్గ సమన్వయ కర్తలు, మంత్రులతో పార్టీలో నెలకొన్న విభేదాలపై అధికార పెద్దలు చర్చిస్తున్నారు. అసంతృప్తి నేతలకు అన్ని విధాల సంతృప్తి కల్గే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. నియోజక వర్గాల్లో పార్టీ విజయం కోసం మీరు ఏ రూట్ లో ముందుకు వెళుతున్నారు..? మీ వ్యూహం ఏంటి..? ఎలాంటి స్ట్రాటజీలను వర్కవుట్ చేస్తున్నారంటూ పార్టీ అధికార పెద్దలు నేతల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సూచిస్తున్నారు. ఇక ఎన్నికల్లో ప్రధాన అంశమైన ఆర్థిక పరమైన విషయాల పైనా కీలక చర్చలు చేపట్టినట్టు తెలుస్తోంది.