వార్షిక బడ్జెట్ కసరత్తును తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన సర్కార్ ఇప్పుడు సవరించిన అంచనాలతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నిర్వహణ పద్దుకు సంబంధించి పెద్దగా మార్పులు చేయకుండా ప్రభుత్వ ప్రాధాన్యా లకు అనుగుణంగా ప్రగతిపద్దులో సవరణలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీల అమలు కోసం నిధుల సర్దుబాటు చేయనుంది.
బడ్జెట్ సమావేశాలు నాలుగో వారంలో ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 4నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన రేవంత్రెడ్డి ప్రభుత్వం, పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించే పనిలో నిమగ్నమైంది. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నాలుగో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే నిధుల అంచనాల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను రూపొందించుకునేందుకు వీలుగా ఈ నెల 3వ వారంలో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించుకునే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. 23న సమావేశా లు ప్రారంభమైనా కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనాల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ను తీర్చిదిద్దేందుకు మరో వారం రోజులు పడుతుందని, ఆ వారం పాటు బిల్లులు, ఇతర అంశాలపైన సభ నడుస్తుందని తెలుస్తోంది.
ఈనెలాఖరుతో తాత్కాలికపద్దు గడువు ముగియనుండగా, వార్షిక బడ్జెట్పై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఆర్థికశాఖ ఇప్పటికే అన్నిశాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకోగా, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం సమర్పించే వార్షిక బడ్జెట్తో, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలపై స్పష్టత వస్తుంది. ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండకపోచ్చని సమాచారం.కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాకు సంబంధిం చి కొంతవరకు అంచనాలు మారవచ్చని, ప్రభుత్వం భావిస్తోంది.ఇక ఓటాన్ అకౌంట్ సమయంలోనే బడ్జెట్పై పూర్తిస్థాయి కసరత్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై ఓ అంచనాకు వచ్చారు. బడ్జెట్లో నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు ఉంటాయి. నిర్వహణ పద్దుకు సంబంధిం చి, గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు, త్వరలో సమర్పించే పద్దులో పెద్దగా మార్పులుండవు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విషయమై ప్రగతి పద్దుకు సంబంధించి మాత్రమే, ఆయా శాఖల నుంచి ప్రతిపాద నలు తీసుకొన్నారు. అది కూడా ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఇచ్చిన హామీలు దృష్టిలో ఉంచుకొని అవసరమైన మార్పులు చేర్పులు ప్రతిపాదించారు.
రాష్ట్రపద్దులో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు నిధులు కేటాయించడం కీలకం కానుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖల పద్దులపై ఓ అంచనాకు రానున్నారు. ఓటాన్ అకౌంట్ పద్దులో 6 గ్యారంటీలకు ఉజ్జాయింపుగా 53 వేల 196కోట్లు ప్రతిపాదించారు. రైతుభరోసాకు 15వేల కోట్లు, పింఛన్లకు ఉద్దేశించిన చేయూత పథకానికి 14 వేల 800 కోట్లు,ఇందిరమ్మ ఇండ్లకు 7వేల740 కోట్లు కేటాయించారు. మహిళలకు నెలనెలా ఇచ్చే 2 వేల 500రూపాయల ఆర్థిక సాయం అందించే మహాలక్ష్మి పథకానికి 7వేల 230 కోట్లు ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం 4 వేల 84కోట్లు, నెలకు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి 2 వేల 418 కోట్లు ప్రతిపాదించారు. రైతు భరోసా విధి విధానాల కోసం ఏర్పాటైన మంత్రివర్గఉపసంఘం సిఫార్సుల మేరకు అవసరమైన కేటాయింపులు చేయనున్నారు. మిగిలిన గ్యారెంటీల అమలు, ఇటీవల ఇచ్చిన హామీలకు తగ్గట్లుగా పూర్తిస్థాయి బడ్జెట్ సిద్ధం కానుందని తెలుస్తోంది.