స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ అవతరణ తొమ్మిదేళ్ల పూర్తి కాలంలో దార్శనికులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో దేశంలో మరే రాష్ట్రం సాధించని రీతిగా తెలంగాణ అభివృద్ధి చెందిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు తెలంగాణ సుపరిపాలన దినోత్సవంగానిర్వహించారు. ఈ సందర్బంగా ఎంసీఆర్ హెచ్చార్దీ లో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమానికి సి.ఎస్ శాంతి కుమారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డీజీపీ అంజనీ కుమార్, ప్రిన్సిపల్ సిసీఎఫ్ దొబ్రీయల్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్ ఓడీ లు, పోలీస్ అధికారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. నీటి పారుదల, వ్యవసాయం, ఐటి, పరిశ్రమలు, విద్యా, ఆరోగ్యం, సంక్షేమం, సుపరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ఆయా రంగాల్లో రికార్డు స్థాయిలో పురోగతి ఉందని వివరించారు. 2014 కు ముందు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఉండి, వాటర్ ట్యాంక్ లకు కూడా పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలియచేసారు. గతంలో వేసవి కాలం వచ్చిందంటే జిల్లా కలెక్టర్లతో సహా ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్ లు రూపొందించే విధానం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని అన్నారు.