తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ విస్తరణ చర్చ హాట్టాపిక్గా మారింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2లోగా మంత్రివర్గ విస్తరణతో పాటు, కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
అంతేకాదు, ప్రస్తుత కేబినెట్లో ఒకరిద్దరు మంత్రులను తప్పించి, వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించే అంశంపైనా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఆశావహ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మంత్రి పదవుల కోసం పలువురు సీనియర్ నేతలు, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం వ్యూహరచన చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ కుమారుడి రిసెప్షన్కు హాజరయ్యే సందర్భంగా ఆయన కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ, శాఖల మార్పులు, ప్రాంతీయ మరియు సామాజిక సమీకరణాలపై కీలక చర్చ జరగొచ్చని సమాచారం.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల కోసం భారీ పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషించిన నేతలు, పార్టీకి ఆర్థికంగా , రాజకీయంగా బలం చేకూర్చిన నాయకులు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు, పనితీరు ఆధారంగా కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు తప్పవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ చర్చలు పూర్తికాకపోతే, కేబినెట్ విస్తరణ మరికొంత కాలం వాయిదా పడే అవకాశమూ లేకపోలేదు.
ఇప్పటికే ఈ ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని పెంచగా, కొత్తగా ఎవరికీ అవకాశం దక్కుతుంది? ఎవరి శాఖ మారుతుంది? ఎవరు ఔట్ అవుతారు? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.


