కంటెంట్ క్రియేటర్, వ్యాపారవేత్త అంకుర్ వారికూ( Ankur Warikoo) సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కోర్సులు అందిస్తున్న తన రూ.100 కోట్ల ఆన్లైన్ కోర్సుల వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
2020లో ప్రారంభమైన ఈ బిజినెస్ తాను ఊహించిన దానికంటే ఎంతో వేగంగా ఎదిగిందని అంకుర్ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఈ కోర్సులను అభ్యసించారని, మొత్తం రూ.100 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయని చెప్పారు. అలాగే రూ.25 కోట్ల లాభాలు వచ్చినప్పటికీ, ఇకపై ఈ వ్యాపారాన్ని కొనసాగించడంలో అర్థం లేదని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్టాపిక్గా మారింది. తన నిర్ణయం వెనుక పూర్తి కారణాలను శనివారం విడుదల చేసే వీడియోలో వివరించనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, అంకుర్ నిర్ణయానికి కృత్రిమ మేధ (AI) కారణమా? అంటూ నెటిజన్లు ప్రశ్నించగా, “అయ్యుండొచ్చు” అంటూ ఆయన స్పందించడం మరింత చర్చకు దారితీసింది. మరోవైపు, ఆయన త్వరలో కొత్త వ్యాపారం ప్రారంభించనున్నారా? అనే ఆసక్తి కూడా నెటిజన్లలో పెరిగింది.


