సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో పోలీస్ భవనంలోని మూడవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో మంటలు వ్యాపించడంతో భవనం మొత్తం పొగతో నిండిపోయింది.
రెస్టారెంట్ పక్కనే ఉన్న హోటల్లో ఆ సమయంలో బస చేస్తున్న 67 మంది అతిథులను అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం చేసి సురక్షితంగా బయటకు తరలించారు. ప్రమాద సమయంలో వేగంగా చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మూడవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.


