దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 బయాలజీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ( Central Bureau of Investigation) కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో పుణేకు చెందిన బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మండారేను సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.
మనీషా మండారేను ఢిల్లీలో అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఆమెను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నియమించిందని, నీట్-యూజీ పరీక్షల ప్రక్రియలో భాగస్వామ్యమైందని తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్లో ఇప్పటికే అరెస్టైన మరో నిందితురాలు మనీషా వాఘ్మారే ద్వారా కొంతమంది నీట్ అభ్యర్థులతో సంప్రదింపులు జరిపిన మండారే, తన ఇంట్లో ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించింది. ఈ తరగతుల్లో బోటనీ, జువాలజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను విద్యార్థులకు చెప్పి, వాటిని నోట్స్గా రాయించిందని సీబీఐ పేర్కొంది.
విద్యార్థులు రాసుకున్న ప్రశ్నల్లో చాలా వరకు మే 3న నిర్వహించిన అసలు నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రంతో పూర్తిగా సరిపోలినట్లు సీబీఐ వెల్లడించింది.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విశ్లేషణ కొనసాగుతోందని తెలిపారు.
ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణే, అహిల్యానగర్ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఐదుగురిని ఏడు రోజుల పోలీస్ కస్టడీకి పంపగా, పుణేకు చెందిన ఇద్దరిని ఢిల్లీకి తరలిస్తున్నారు. మిగిలిన వారిని విచారిస్తున్నారు.
కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నాపత్రాల లీక్కు అసలు మూలాలు, మధ్యవర్తుల నెట్వర్క్ను గుర్తించినట్లు సీబీఐ తెలిపింది. లక్షల రూపాయలు తీసుకుని ప్రత్యేక కోచింగ్ పేరుతో విద్యార్థులకు ప్రశ్నలు చెప్పినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొంది.
ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పీవీ కులకర్ణిని కూడా సీబీఐ ఇటీవల అరెస్ట్ చేసింది. ఆయన ఎన్టీఏ తరఫున పరీక్షల ప్రక్రియలో భాగమైన కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేశారని, నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రాలకు ఆయనకు యాక్సెస్ ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది.
ఏప్రిల్ చివరి వారంలో పుణేలోని తన ఇంట్లో ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించి, ప్రశ్నలు, సమాధానాలను చెప్పినట్లు సీబీఐ తెలిపింది. విద్యార్థులు రాసుకున్న ప్రశ్నలు అసలు కెమిస్ట్రీ ప్రశ్నాపత్రంతో పూర్తిగా సరిపోలినట్లు పేర్కొంది.
ఈ ప్రశ్నాపత్ర లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ ఉన్నత విద్యా విభాగం ఫిర్యాదు మేరకు మే 12న సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.


