రెండేళ్ల క్రితం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ని పోలీసులు నిందితుడిగా చేర్చారు. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో చేతిలో ఉన్న రెండు నెలల శిశువు కిందపడి మృతి చెందాడు. అనంతరం సంఘటనా స్థలం నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు.
అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని..ఆ కారుపై ఉన్న స్టిక్కర్ ఆధారంగా షకీల్ కారుగా గుర్తించారు. ఘటనపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రమాద సమయంలో కారులో షకీల్ కొడుకు రాహీల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు గుర్తించారు. కారు ఎవరు నడిపా రన్న దానిపై అప్పట్లో స్పష్టత లభించలేదు. కారు తనే నడిపానంటూ పోలీసులకు ముందు ఆఫ్నాన్ అనే యువకుడు లొంగిపోయాడు. తాజాగా షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు చేసి రాహీల్ను నిందితుడిగా చేర్చారు జూబ్లీహిల్స్ పోలీసులు.