ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్లమెంటులో హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉంది. వరంగల్, మహ బూబాబాద్ తో పాటు రద్దయిన హనుమకొండ లోకసభ స్థానాల నుంచి ఎన్నికై పార్లమెంట్లో అడుగుపెట్టిన ఉద్దండులైన నాయకులు కేంద్ర మంత్రులుగా తమ సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాలనుంచి ప్రధాని అయిన పి.వి. నరసింహారావు ఈ జిల్లాకు చెందిన వారే. పీవీ, ఎందరోకీలక మంత్రులు. ఓరుగల్లు ఖ్యాతిని యావద్దేశానికి చాటారు. వీరిపై ప్రత్యేక కథనం.
ఒకప్పుడు హనుమకొండ హేమాహేమీల అడ్డా. రద్దయిన హనుమకొండ లోకసభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు, వరంగల్ నుంచి రెండుసార్లు గెలుపొందిన పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించి ఓరుగల్లు ఖ్యాతిని నలుదిశలాచాటారు. వారితో పాటు వరంగల్, మహబూబాబాద్ కు ప్రాతినిధ్యం వహించిన కమాలుద్దీన్ అహ్మద్, బలరాం నాయక్ వంటివారు కేంద్రంలో కీలక బాధ్యతలను చేపట్టి రాణించారు.
వరంగల్ జిల్లా వంగర లో జన్మించిన పీవి నరసింహారావు 1977లో ఎన్నికై మొదటి సారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పక్షాన పోటీ చేసిన ఆయన అభ్యర్థి పి జనార్థనరెడ్డి పై 77,683 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి 1980లో మరో సారి కాంగ్రెస్ -ఐ- అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ యూ నుంచి బరిలో నిలిచిన ఇదే ప్రత్యర్థి పి జనార్దన్ రెడ్డిపై రెండింతల మెజారిటీతో అంటే 1,62,949 ఓట్లతో విజయం సాధించారు. 1977లో హనుమకొండ నుంచి ఎంపీగా గెలిచిన పీవీ పార్లమెంట్ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిం చారు. 1980 ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుంచి రెండోసారి గెలిచి తర్వాత విదేశాంగ మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పదవులు నిర్వహిం చారు. అయితే 1984 ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది దేశమంతా కాంగ్రెస్ గెలిచినా ఇక్కడ మాత్రం బీజేపీ అభ్యర్థి సి, జంగారెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. దేశవ్యాప్తంగా రెండే రెండు స్థానాల్లో బిజెపి గెలుపొందింది. లక్నోలో వాజపేయి, వరంగల్ పార్లమెంటు అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి గెలుపొందారు. . ఈ ఓటమితోరాజకీయంగా పీవీ ఓరుగల్లు కు దూరమయ్యారు.
1984 తర్వాత ఎప్పుడు ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయలేదు. 1984 ఎన్నికల్లో మహారాష్ట్రలోని రామ్ టెక్ నుంచి పోటీ చేసిన పీవీ అక్కడ విజయం సాధించారు. కేంద్రంలో రక్షణశాఖ మంత్రిగా, కేంద్ర మానవ వన రుల అభివృద్ధి శాఖ మంత్రిగా, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిగా, విదే శాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహిం చారు. 1989 ఎన్నికల్లో ఇదే రామ్ టెక్ నుంచి మరో సారి గెలిచారు. విదేశీ వ్యవ హారాలు, పార్లమెంట్ సంప్రదింపుల కమి టీసభ్యులుగా, ఆ తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశారు. 1991 జూన్ 21న అనూహ్యంగా ఆయన ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించారు.
వరంగల్ నుంచి పార్లమెంట్ లో రాణించిన మరో నేత కమాలొద్దీన్ అహ్మద్. హనుమకొండ లోకసభ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. కమలొద్దీన్ ఆహ్మద్ 1980 ఎన్నికల్లో వరంగల్ ఎంపి స్థానం నుంచి మొదటి సారి ఎన్నికయ్యారు. 1989, 1991, 1996 ఎన్నికల్లో హనుమకొండ లోకసభ స్థానం నుంచి వరుసగా గెలుపొందిన ఆయన 1991 నుంచి 1994 వరకు కేంద్ర పౌరసర ఫరాల సహాయ మంత్రిగా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరారు. 2003 – 2004 మధ్య ఏడాదిపాటు సౌది అరేబియా భారత రాయబారిగా పని చేశారు. 2009లో కొత్తగా పునరుద్ధరించిన మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పోరిక బలరాం నాయక్ తొలిసారి ఎన్నికైనా కేంద్ర మంత్రిగా పని చేశారు. 2012 అక్టోబర్ లో మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత మళ్లీ ఇప్పటివరకు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి ఎవరు కూడా మంత్రి కాలేదు. మరి ఈసారి వరంగల్ జిల్లా అభ్యర్థి కేంద్రంలో మంత్రిపదవి చేపడతారేమో చూడాలి.


