మైకుల మోత లేక ఆ నియోజకవర్గం వెలవెలబోయింది. నేతల ప్రసంగాలు, ప్రచార ఆర్భాటాలు లేక నిశ్శబ్ధ వాతావరణంతో ఎన్నికల కళ తప్పింది. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది. ?
సార్వత్రిక ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. ర్యాలీలు, రోడ్షోలు, సభలతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారపర్వంలో దూకుడు పెంచాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో.. తెలంగాణ లోనూ అదే జోరు కొనసా గుతోంది. అయితే మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని భద్రాచలం, పినపాక, ఇల్లందు మన్యం ప్రాంతంలో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. కార్యకర్తల సందడి లేక వెలవెలబో యింది. ప్రచార ఆర్భాటాలు లేక, నేతల ప్రసంగాలు లేక మైకులు మూగబోయాయి. గెలుపుపై ఆశలు వదులుకున్న గులాబీ, కమల దళం నైరాశ్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ విజయం పక్కా అని భావించిన నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక హస్తం పార్టీ మాత్రమే నామమాత్రంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఇండియా కూటమిలో ఉన్న మిత్ర పక్షాలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన కాంగ్రెస్ అందుకు అంత ఉత్సాహం చూపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ కైవసం చేసుకున్న ఏకైక స్థానం భద్రాచలం. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఉన్న ఒక్క భద్రాచలం ఎమ్మెల్యే హస్తం గూటికి చేరిపోయారు. దీంతో మాహబూబాద్ పార్లమెంట్పై ఆశలు వదులుకున్న గులాబీ దళం ప్రచారానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్కు మహబూబాబాద్ సిట్టింగ్ స్ధానం అయినప్పటికీ.. గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం చెందడంతో పాటు భద్రాచలం నియోజకవర్గంలో ప్రధాన నాయకత్వం మొత్తం కాంగ్రెస్ గూటికి చేరుకోవడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గం అభ్యర్ధి ప్రచారంపై ఆసక్తి చూపటం లేదు. ఇక నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న తాత మధు సైతం భద్రాచల నియోజకవర్గంలో కేవలం సమన్వయ కమిటీలు వేసి చేతులు దులుపుకున్నారు. ఇకపోతే కొందరు నేతలు బీఆర్ఎస్ ఉనికిని కాపాడే ప్రయత్నం చేద్దామంటే, డబ్బు కొరతతో వెనకడుగు వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలకు విచ్చలవిడిగా డబ్బులు పంచిన ఫలితంగా.. ఇప్పుడు అంత సొమ్ము సమకూర్చే పరిస్థితులు లేకపోవడంతో ప్రచార ఊసే లేదు.
ఇక అభ్యర్ధిపైనే గంపెడు ఆశలు పెట్టుకున్న బీజేపీ సైతం ఇప్పటి వరకు భద్రాచలం నియోజకవర్గంలో ప్రచారాన్ని చేసిన దాఖలు కనిపించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో ఉనికిని కూడా నిలబెట్టుకోలేకపోయింది బీజేపీ. దీంతో ఇక్కడ ప్రచారం చేయడం వలన వచ్చే ప్రయోజనం ఏం లేదన్న భావనలో ఉన్న కమలనాథులు.. ఈ నియోజకవర్గం వైప కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇలా కాషాయ దళం కూడా ప్రచారానికి దూరంగా ఉంటోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారాన్నే ఉపాధిగా ఎంచుకునే వారి పరిస్థితి దయనీయంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్చులు ఎర చూపి జెండాలు మోయించిన రాజకీయ నాయకులు.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నా ప్రచారానికి పిలవకపోవడంతో ఆ పార్టీ నాయకులపైనే బహిరంగంగా అసంతృఫ్తిని వెళ్లగక్కుతున్నారు. ఇలా మొత్తానికి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరికి వారు ఓ అంచనాతో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. గెలుపు ధీమాతో కాంగ్రెస్, ఓటమి తప్పదన్న భావనతో గులాబీ దళం, ఉనికే లేదన్న నైరాశ్యంలో కమలనాథులు భద్రాచంలో మన్యంపై అంత ఆసక్తి చూపటం లేదన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.