అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్, తెలంగాణ, స్త్రీల విభాగము – స్త్రీ శక్తి – సోషల్ స్ఫూర్తి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాంపల్లి లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్త్రీ తన గురించి తాను తెలుసుకుని, తన, తన కుటుంబ, సమాజ ఉన్నతికి, స్త్రీ పాత్ర యొక్క అవగాహనను కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీమతి స్రవంతి మాట్లాడుతూ.. స్త్రీ శక్తి – సోషల్ స్ఫూర్తి ఎందుకు ఏర్పాటు చేశారో దాని లక్ష్యాలేమిటో వివరించారు. శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు బోధిస్తున్న ప్రస్థాన ధ్యాన విధానముతో.. స్త్రీ తనలోని నిగూఢ నిక్షిప్త శక్తిని జాగృతం చేసుకోవచ్చని.. అమ్మ లేక – జన్మ లేదని.. ఏక కణ జీవి తప్ప ఏ జీవికైనా స్త్రీ తత్వమే జన్మను ఇచ్చేదని వారు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని హైకోర్టు మాజీ జడ్జి శ్రీమతి టి.రజని, ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు విభాగ మాజీ హెడ్ శ్రీమతి డాక్టర్ కుసుమా రెడ్డి , వనితా ఉమెన్స్ కాలేజీ తెలుగు శాఖ మాజీ హెడ్ డాక్టర్ ముక్తేవి భారతి, స్ఫూర్తి కుటుంబం ఆథర్ శ్రీమతి రమణి రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల ఖాఖ అధికారి శ్రీమతి బాల సరోజిని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
అనంతరం స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్, తెలంగాణా ట్రస్టీ శ్రీమతి డాక్టర్ విమల శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి విశిష్టతను గురించి, స్త్రీ ప్రాధాన్యతను గురించి వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు మాజీ జడ్జి శ్రీమతి రజని మాట్లాడుతూ… మహిళలు సాధికారికతలను సాధించాలని, సమాజానికి కూడా కొంత ఉపయోగపడుతూ జీవితాలను సార్థకం చేసుకోవాలని అన్నారు. ఏ గురువు చెప్పినా, ఆధ్యాత్మికత చెప్పినా, రాజ్యాంగం చెప్పినా ఒకే విషయం చెబుతాయని అదే Live and Let Live అని అన్నారు.
ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు విభాగం మాజీ అధిపతి డాక్టర్ కుసుమా రెడ్డి మాట్లాడుతూ.. స్ఫూర్తి కుటుంబం నిర్వహిస్తున్న మహిళా దినోత్సవం ఇతరుల కంటే భిన్నమైనదని అన్నారు. మహిళా దినోత్సవం నిర్వహించటం సంతోషకరమైన విషయమని అన్నారు. కేవలం హక్కుల కోసం పోరాడటం వల్ల, సన్మానాలు పొందటం వల్ల సాధించేది ఏం లేదన్నారు. మహిళలంతా బాగా చదువుకోవాలని.. ఇతరుల కంటే మహిళలు భిన్నంగా ఉండాలంటే శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు చెప్పినట్లు ఆసన, ప్రాణాయామ ధ్యానం చేయాలన్నారు. ఇది ఇంట్లో తన పిల్లలకు స్త్రీ మాత్రమే నేర్పగలదని అన్నారు. ఆమె తలుచుకుంటే ఇంటినే కాదు సమాజాన్నే మార్చగలదని అన్నారు.
మరో అతిథి, ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముక్తేవి భారతి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం అనగానే హక్కులు, పోరాటాలు గుర్తుకు వస్తాయని అయితే శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి మాత్రం దీన్ని ఓ కొత్త కోణంలో చూస్తారన్నారు. మహిళలు కేవలం ఉద్యమాల కోసం మాత్రమే వెళ్లకూడదని వారు విద్యావంతులైతే సమాజానికి స్ఫూర్తిని ఇవ్వగలుగుతారని అన్నారు. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ముఖ్యమేనని ఆ ఇద్దరూ సఖ్యంగా ఉండి సంతానవంతులై తే సమాజానికి అలాంటి కుటుంబమే బలమన్నారు. వినోద జీవితం మాత్రమే కాదు విలువలు కూడా ముఖ్యమని యువతులు గుర్తించాలన్నారు.
కార్యక్రమానంతరం ముఖ్య అతిథులకు ఆత్మీయ సత్కారం అందజేశారు. ముఖ్య అతిథుల చేతులమీదుగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అటు తర్వాత శ్రీమతి మాధవి గురువుతో తనకున్న అనుభవాలను వారి గైడెన్స్ తో తాను ఎలా జీవితంలో ముందుకు వెళ్లగలిగారో వివరించారు. అనంతరం బ్లెస్సింగ్స్ , మహాప్రసాదంతో కార్యక్రమాలు ముగిశాయి.
Read Also: Naveen Murder Case |విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన నిహారిక
Follow us on: Youtube Instagram